పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 12 గంటల్లో బలపడి అదే ప్రాంతంలో వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం తీవ్రవాయుగుండంగా మరింత బలపడి శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్రల మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు చేసింది. వచ్చే 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసి, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, చెట్ల కింద నిలబడరాదని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. వరుసగా ఒకదాని వెంట ఒకటి అల్పపీడనాలు ఏర్పడటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
మరోవైపు, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 48.1 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12,38,852 క్యూసెక్కులుగా ఉంది. అటు, కృష్ణా వరద ప్రవాహం నిలకడ ఉండగా.. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,61,974 క్యూసెక్కులుగా నమోదయ్యింది. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలకు ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టే వదులుతున్నారు. రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa