ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే విజయవాడలో దసరా ఉత్సవాలు ముగింపు.. తెప్పోత్సవం రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 06:53 PM

విజయవాడలోని ఇంద్రకీల్రాదిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన విజయదశమి నాడు దుర్గమ్మ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమివ్వనున్నారు. సాయంత్రం జరిగే తెప్పోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అయితే, ఈ ఏడాది హంసవాహన తెప్పోత్సవం లేకుండానే ఉత్సవాలు ముగయనున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో తెప్పోత్సవం రద్దు చేశారు. ఈ ప్రవాహంలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహణ వీలుపడదని జలవనరుల విభాగం తేల్చిచెప్పింది. తెప్పోత్సవానికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా, 2022, 2023లో కూడా భారీ వర్షాలతో తెప్పోత్సవాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.


మహా మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతేడాది కృష్ణా నది ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఒడ్డున దుర్గాఘాట్‌పై సిద్ధం చేసిన హంస వాహనంపై క్రతువు పూర్తిచేశారు. కానీ, ప్రస్తుతం ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్కులకు మించి ఉంది. ఇంకా రేపటికి పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 2న జరిగే అమ్మవారి తెప్పోత్సవం ఆలయ అధికారులు రద్దు చేశారు.


మరోవైపు, ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనాలకు భక్తులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. గతేడాది పది రోజుల్లో 8.94 లక్షల మంది భక్తులు, ఆ తర్వాత రెండు రోజులు భవానీ భక్తులను కలిపి మొత్తం 12 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కానీ, ఈసారి తొమ్మిది రోజుల్లోనే 11 లక్షల మంది దర్శించుకోవడం విశేషం. సోమవారం అమ్మవారి జన్ననక్షత్రమైన మూలానక్షత్రం రోజున (సరస్వతి అలంకారం) 1.95 లక్షల మంది, మంగళవారం అష్టమి రోజున (శ్రీదుర్గాదేవి) 1.30 లక్షల మంది రావడం విశేషం. చివరి రెండు రోజుల్లో మరో 3 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన విజయదశమి ముగిసేసరికే 14 లక్షలు చేరుకోనుంది.


దసరా తర్వాత రెండు రోజులు రాజరాజేశ్వరిదేవి రూపంలోని అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ రూపంలోని దుర్గమ్మను దర్శించుకోడానికి కనీసం 4 లక్షల మంది భవానీలు తరలిరానున్నారు. మొత్తంగా ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో 18 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేశారు. ఈ అంచనాలకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం వెల్లడించిన వాటి కంటే మరో 10 నుంచి 20 శాతం మంది ఎక్కువే ఉంటారని అధికారులు తెలిపారు. గతంలో తొలి ఐదు రోజుల్లో లక్ష దాటడం గగనం. అలాంటిది ఈసారి మూడో రోజు నుంచే ఆ మార్క్ దాటిపోయి.. అప్పటి నుంచి రద్దీ పెరుగుతూ వస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa