రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. గత సంవత్సరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాస్కోలో పర్యటించిన సమయంలో అందించిన ఆహ్వానం మేరకు.. పుతిన్ ఇప్పుడు భారత్కు వస్తున్నారు. ఈ ఉన్నత స్థాయి పర్యటనకు సంబంధించిన తేదీలు కూడా తాజాగా ఖరారైనట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఇటీవల రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగానే పుతిన్ భారత్ రాక తేదీలను ఖరారు చేస్తున్నట్లు అప్పుడే ఆయన ప్రకటించారు. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ 5, 6వ తేదీల్లో పుతిన్ న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత తొలిసారి భారత్కు..
2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక్కసారి కూడా భారత దేశానికి రాలేరు. కానీ తొలిసారిగా ఆయన ఇండియాకు రెండ్రోజుల పర్యటన నిమిత్తం రాబోతున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చించే అవకాశం ఉంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై అమెరికా భారీగా సుంకాలను విధించిన విషయం అందరికీ తెలిసిందే. అమెరికా తీసుకున్న ఈ చర్యలు.. యూఎస్-భారత్ మధ్య సంబంధాలను కొంతమేర దెబ్బతీస్తున్న సమయంలో పుతిన్ పర్యటన ఖరారవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాషింగ్టన్ విధించిన సుంకాలతో రెండు దేశాల మధ్య దూరం పెరుగుతుండగా.., అదే సమయంలో భారత్-రష్యా మధ్య దశాబ్దాల నాటి మైత్రిబంధం మరింత బలోపేతం అవుతోంది.
రష్యా చమురుపై సుంకాలు విధించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా సహకారం అందకుండా రష్యాపై ఒత్తిడి పెంచాలని అమెరికా భావించింది. అయితే తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నామని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా యుద్ధం వల్ల సంప్రదాయ చమురు సరఫరాలు దెబ్బతినడంతో.. తక్కువ ధరకు లభిస్తున్న రష్యా చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-రష్యా సంబంధాలు మరింత దృఢంగా మారుతుండడం, ఈ క్రమంలోనే పుతిన్ భారత్ పర్యటనకు రావడం అంతర్జాతీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
గతంలో షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ కలుసుకుని వ్యక్తిగతంగా సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఆ చర్చల కొనసాగింపుగా ఈ డిసెంబర్ పర్యటన జరగనుంది. రష్యా అంతర్జాతీయంగా ఒంటరిగా మారకుండా కీలక భాగస్వామిగా ఉన్న భారత్కు పుతిన్ రాక, ఇరు దేశాల వ్యూహాత్మక మైత్రికి మరింత బలం చేకూర్చుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంమీద అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. భారత్ తన విదేశాంగ విధానంలో స్వతంత్రతను చాటుతూ, తన మిత్ర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడంలో ఈ పర్యటన అత్యంత కీలక ఘట్టం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa