దసరా పర్వదినం రోజు కర్నూలు జిల్లాలో ఏటా జరిగే దేవరగట్టు బన్ని ఉత్సవం నెత్తురోడింది. సంప్రదాయం పేరిట జరిగే కర్రల సమరం హింసాత్మకంగా మారి ఇద్దరు భక్తులను బలిగొంది. ఈ ఘర్షణలో మరో వంద మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హొళగుంద మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా గురువారం అర్ధరాత్రి మాళ మల్లేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో దేవతామూర్తులను దక్కించుకునేందుకు రెండు వర్గాల భక్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఏటా జరిగే ఈ కర్రల సమరం ఈసారి శ్రుతిమించి హింసకు దారితీసింది. ఈ భీకర పోరులో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామిని దక్కించుకోవడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వర్గంగా, అరికెర, సుళువాయి, ఎల్లార్తి సహా ఏడు గ్రామాల భక్తులు మరో వర్గంగా విడిపోయి కర్రలతో తలపడతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే, ఏటా ఈ ఉత్సవంలో వందల మంది గాయపడుతున్నా, ఈ ఆచారం మాత్రం ఆగడం లేదు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, భక్తులకు అవగాహన కల్పిస్తున్నా హింస మాత్రం పునరావృతమవుతూనే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa