ట్రెండింగ్
Epaper    English    தமிழ்

7 వేల కిలోమీటర్ల వేగంతో నూతనంగా తయారుచేయబడిన 'ధ్వని' క్షిపణి

national |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 02:10 PM

భారత రక్షణ రంగంలో మరో సంచలనం రాబోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బ్రహ్మోస్ క్షిపణిని మించిపోయే అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని భారత్ సిద్ధం చేస్తోంది. 'ధ్వని' అనే పేరుతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) వేగంగా అడుగులు వేస్తోంది.'ధ్వని' క్షిపణి ధ్వని వేగం కన్నా ఐదారు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం గంటకు సుమారు 7 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ అసాధారణ వేగం 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఈ కొత్త అస్త్రానికి ఉంది.ఈ క్షిపణి ప్రత్యేకత కేవలం దాని వేగమే కాదు, ప్రయాణ మార్గంలో దిశను మార్చుకోగల సామర్థ్యం కూడా వుంది. ఈ కారణంగా శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు దీనిని గుర్తించి, అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాధారణ క్రూయిజ్ క్షిపణుల్లా కాకుండా, దీనిని ముందుగా ఒక రాకెట్ బూస్టర్ సాయంతో అత్యంత ఎత్తుకు పంపిస్తారు. అక్కడ బూస్టర్ నుంచి విడిపోయిన 'ధ్వని' గ్లైడ్ వెహికల్, సెమీ-బాలిస్టిక్ మార్గంలో హైపర్‌సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఇది రాడార్ల కంట పడకుండా ఉండేందుకు దోహదపడుతుంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎయిర్‌ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే థర్మల్ మేనేజ్‌మెంట్, స్క్రామ్‌జెట్ ఇంజిన్ పనితీరు వంటి కీలకమైన ప్రాథమిక పరీక్షలను డీఆర్‌డీఓ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి పరీక్షలకు సన్నద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa