ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాంధ్ర వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 09:35 PM

ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, సురక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావంతో నెలకొన్న పరిస్థితులను అధికారులు ఆయనకు వివరించారు. ఒడిశా నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో వంశధార, నాగావళి నదులు ఉప్పొంగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని గొట్టా బ్యారేజీతో పాటు, వంశధార ప్రాజెక్టులోకి అంచనాలకు మించి వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమాచారం అందుకున్న పవన్, సహాయక చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. "వరద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలి" అని ఆయన నిర్దేశించారు. వరద తగ్గిన తర్వాత పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే సమీప జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులపై ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో క్లోరిన్ కలిపిన సురక్షిత తాగునీటిని అందించాలని ఆదేశించారు. నీరు కలుషితం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే ముంపునకు గురయ్యే గ్రామాల్లోని ప్రజలను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించిందని అధికారులు సమావేశంలో వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి నివేదికలు పంపాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa