ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగపూర్‌లో ఇద్దరు భారతీయ పర్యాటకులకు 5 ఏళ్ల జైలుశిక్ష

international |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 09:09 PM

 సింగపూర్‌కు సెలవుల నిమిత్తం వెళ్లిన ఇద్దరు భారతీయ పర్యాటకులకు అక్కడి న్యాయస్థానం ఎవరూ ఊహించని శిక్ష వేసింది. హోటల్ గదుల్లో ఇద్దరు వైశ్యలపై దాడి చేసి, దోపిడీకి పాల్పడిన నేరం రుజువు కావడంతో.. వారికి ఐదు సంవత్సరాల ఒక నెల జైలు శిక్షతో పాటు 12 కొరడా దెబ్బలు విధించింది. శుక్రవారం రోజు న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది.


కోర్టులో విచారణ సందర్భంగా వెల్లడైన వివరాల ప్రకారం... 23 ఏళ్ల అరోక్కియాసామి, 27 సంవత్సరాల రాజేంద్రన్ ఏప్రిల్ 24వ తేదీన భారత దేశం నుంచి విహార యాత్ర కోసం సింగపూర్‌కు చేరుకున్నారు. రెండు రోజుల తర్వాత వారు 'లిటిల్ ఇండియా' ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. అపరిచిత వ్యక్తి వారిని సంప్రదించి, లైంగిక సేవలు కావాలా అంటూ అడిగాడు. వారు కూడా ఆసక్తి కనబర్చడంతో.. అపరిచిత వ్యక్తి ఇద్దరు మహిళల సంప్రదింపు వివరాలను వారికి ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అరోక్కియాసామి.. రాజేంద్రన్‌తో మాట్లాడుతూ తమకు డబ్బు అవసరమని, అందుకే ఆ మహిళలను హోటల్ గదికి పిలిపించి దోచుకుందామని చెప్పాడు. రాజేంద్రన్ కూడా దీనికి అంగీకరించడంతో.. అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక మహిళను హోటల్ గదికి రప్పించడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు.


 మొదటి బాధితురాలు గదిలోకి రాగానే.. నిందితులు వెంటనే ఆమె చేతులు, కాళ్లను బట్టలతో కట్టేశారు. చెప్పిన మాట వినకపోతే చంపుతామంటూ బెదిరించారు. చెంపపై కొట్టారు. ఆపై ఆమె వద్ద ఉన్న నగలు, సుమారు 2,000 సింగపూర్ డాలర్ల నగదు, పాస్‌పోర్ట్, బ్యాంకు కార్డులను బలవంతంగా లాక్కున్నారు. ఆపై ఆమెను అదే గదిలో బంధించి మరో హోటల్‌కు చేరుకున్నారు. రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో.. నిందితులు మరో హోటల్‌లో రెండో మహిళను కలవడానికి ప్లాన్ చేశారు. ఆమె గదికి చేరుకున్న తర్వాత.. ఒకరు గట్టిగా పట్టుకోగా మరొకరు దోచుకునే ప్రయత్నం చేశారు. ఆమె కేకలు వేస్తుండడంతో.. రాజేంద్రన్ నోటిని గట్టిగా మూసేశాడు. ఈక్రమంలోనే అరోక్కియాసామి ఆమె దగ్గర నుంచి 800 సింగపూర్ డాలర్లు, రెండు మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్ట్‌ను దొంగిలించారు. వారు తిరిగి వచ్చే వరకు గదిలో నుంచి కదలకుండా ఉండాలని ఆమెను తీవ్రంగా బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.


అయితే హోటల్ సిబ్బంది సాయంతో ఇద్దరు బాధితులు బయటపడ్డారు. మొదటి బాధితురాలు భయంతో విషయం ఎక్కడా చెప్పలేదు. కానీ రెండో మహిల మాత్రం మరో వ్యక్తికి జరిగిందంతా చెప్పింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అరోక్కియాసామి, రాజేంద్రన్‌లపై కేసులు నమోదు చేసి.. హోటల్ సీసీటీవీ ఆధారంగా వారిద్దరినీ గుర్తించారు. కొన్ని గంటలపాటు శ్రమించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై కోర్టులో హాజరు పరిచారు. ఈక్రమంలోనే తమ తప్పు ఒప్పుకున్న నిందితులు ఇద్దరూ.. న్యాయమూర్తిని క్షమాభిక్ష కోరుతూ తమ శిక్షను తగ్గించాలని అభ్యర్థించారు. అరోక్కియాసామి ఓ అనువాదకుడిని పెట్టుకుని మరీ తన బాధను న్యాయమూర్తికి చెప్పాడు.


ముఖ్యంగా తన తండ్రి గత ఏడాదే మరణించినట్లు పేర్కొన్నాడు. తనకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారని.. వారిలో ఒకరికి మాత్రమే వివాహం జరిగిందని వివరించాడు. తమ వద్ద డబ్బులు కూడా లేవని.. అందుకే ఈ నేరానికి పాల్పడ్డట్లు పేర్కొన్నాడు. రాజేంద్రన్ కూడా తన భార్య, బిడ్డ భారత దేశంలో ఒంటరిగా ఉన్నారని.. వారు ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారని విన్నవించుకున్నాడు. అయితే సింగపూర్ చట్టాల ప్రకారం... దోపిడీ సమయంలో స్వచ్ఛందంగా గాయం కలిగించిన వారికి ఐదు నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కనీసం 12 కొరడా దెబ్బల శిక్ష తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. కానీ నిందితుల బాధ విన్న న్యాయమూర్తి ఇద్దరికీ చెరో 5 సంవత్సరాల జైలుశిక్ష వేస్తూ.. 12 కొరడా దెబ్బలు వేయాలని అధికారులకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa