ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయికి హాయ్ మెసేజ్ పెట్టాడు.. రూ.కోటి పోగొట్టుకున్నాడు

Crime |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 09:12 PM

హాయ్ మెసేజ్ పెట్టడమే పాపమైంది.. పాపం ఆ పెద్దాయన ఏకంగా రూ.కోటి పోగొట్టుకున్నాడు. గుంటూరులోని ఎస్వీఎన్‌ కాలనీకి చెందిన నల్లూరి వెంకటేశ్వర్లుకు నాలుగు నెలల కిందట వెంకటేశ్వర్లుకు 'శైలజ' అనే పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. ఆయన 'హాయ్' అని రిప్లై ఇచ్చారు. ఆ మహిళ వెంటనే 'కాల్‌బాయ్‌గా వెళతారా.. డబ్బులు వస్తాయి' అని చెప్పింది. వెంటనే ఆయన స్పందించి.. తన వయసు 68 సంవత్సరాలన్నారు. తనకు మరోసారి మెసేజ్‌లు, కాల్స్ చేయొద్దని మహిళకు చెప్పారు. అయినా సరే ఆ గుర్తుతెలియని మహిళ వెంకటేశ్వర్లును వదల్లేదు.. ఫోన్లు చేస్తూనే ఉంది.


అయితే కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ వెంకటేశ్వర్లుకు మరోసారి ఫోన్ చేసింది.. బెదిరింపులు మొదలు పెట్టింది. 'మీరు మహిళలతో అసభ్యంగా చాట్ చేశారని నా భర్త ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బు ఇవ్వాలి' అని బెదిరించింది. అయినా సరే వెంకటేశ్వర్లు వెనక్కు తగ్గలేదు.. డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత మరో కొత్త మొబైల్ నంబర్ నుంచి వెంకటేశ్వర్లుకు కాల్ వచ్చింది.


ఆయనకు ఫోన్ చేసిన వారు 'ఐటీ అధికారులం' అంటూ బెదిరింపులకు దిగారు. 'మీ రైస్ మిల్లుపై దాడి చేసేందుకు వస్తున్నామని' బెదిరించారు. ఇలా వరుసగా చాలాసార్లు బెదిరించి వెంకటేశ్వర్లు నుంచి మొత్తం రూ.1 కోటి తీసుకున్నారు. కొద్దిరోజులకు మోసపోయినట్లు గమనించిన వెంకటేశ్వర్లు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.


సైబర్ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఫేక్ కాల్స్, మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదే, పదే హెచ్చరిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఐటీ అధికారులు, జీఎస్టీ అధికారుల పేరుతో ఎవరైనా కాల్స్ చేస్తే నమ్మొద్దని సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాల పేరుతో వాట్సాప్‌కు వచ్చే ఏపీకే ఫైల్స్‌ను కూడా నొక్కొద్దని హెచ్చరించారు. అయినా సరే కొందరు మాత్రం ఇలా అమాయకంగా మోసపోతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa