రెండు విడతల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్స్ కూడా!(ఫోటోలు- Samayam Telugu)
గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. 2 విడతల్లో 243 స్థానాలు ఉన్న బిహార్కు శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. నవంబర్ 6వ తేదీన తొలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా.. 11వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. బిహార్తోపాటు పలు రాష్ట్రాల్లోని పలు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ బైపోల్స్ నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14వ తేదీన ఫలితాలు రానున్నాయి.
తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. 17వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించగా.. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించారు. ఇక నవంబర్ 6వ తేదీన తొలి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈనెల 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు ఈనెల 23వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఇక వచ్చే నెల 11వ తేదీన రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 14వ తేదీన చేపట్టి.. ఆ రోజే ఫలితాలను ప్రకటించనున్నారు.
243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బిహార్లో ఎస్సీలకు 38 సీట్లు, ఎస్టీలకు 2 స్థానాలు రిజర్వ్ చేశారు. ఇక బిహార్ వ్యాప్తంగా మొత్తం 90,712 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పింది. ఇక బిహార్ వ్యాప్తంగా మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వారిలో పురుష ఓటర్లు 3.92 కోట్లు.. మహిళా ఓటర్లు 3.5 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. కొత్తగా ఈ ఎన్నికలకు 14 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వివరించింది. ఇక బిహార్లో వందేళ్లు దాటిన ఓటర్లు 14 వేల మంది ఉన్నారని వెల్లడించింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి కొత్తగా 17 రకాల సంస్కరణలను తీసుకువస్తున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. భవిష్యత్లో వీటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. గతంతో పోలిస్తే ఓటర్ జాబితాను మరింత సులభం చేసినట్లు వివరించారు. ఎన్నికలను మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ను నియమిస్తామని.. మొత్తం 243 మంది పరిశీలకులను నిమిస్తామని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ తర్వాతే వీవీ ప్యాట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. వీవీ ప్యాట్ ఓట్లలో ఏదైనా మిస్ మ్యాచ్ అయితే.. రీకౌంటింగ్ తప్పనిసరి అని వెల్లడించారు. 22 ఏళ్ల తర్వాత బిహార్ ఓటర్ జాబితాను పూర్తి స్థాయిలో సంస్కరించినట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఇక నుంచి ఈవీఎంలపై పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన కలర్ ఫోటోలను ముద్రిస్తామని తెలిపారు. అభ్యర్థులను ఓటర్లు.. సులభంగా గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులకైనా 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa