ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత ఎన్నికల ప్రక్రియలో కొత్తగా 17 మార్పులు.. బిహార్ పోల్స్‌ నుంచే మొదలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 08:36 PM

దేశ ఎన్నికల ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త శకానికి నాంది పలికింది. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎన్నికల నిర్వహణలో సరికొత్త సంస్కరణలను అమలు చేయనున్నారు. ఆ తర్వాత వీటిని దేశవ్యాప్తంగా తీసుకురానున్నారు. దీనికి సంబంధించి.. తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నిర్వహణ తర్వాత దేశవ్యాప్తంగా వీటిని అమలు చేసేందుకు ఈ ఎన్నికల సంస్కరణలను ప్రకటించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియను మరింత మెరుగుపరిచి.. పారదర్శకతను పెంచడానికి అని వివరించారు. అదే సమయంలో ఓటర్లకు మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా వీటిని తీసుకువచ్చినట్లు సీఈసీ వెల్లడించారు. భవిష్యత్‌లో వీటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. గతంతో పోలిస్తే ఓటర్ లిస్ట్‌ను మరింత సులభతరం చేసినట్లు వివరించారు.


ఎన్నికల సంఘం ప్రకటించిన 17 ముఖ్యమైన సంస్కరణలు


ఓటరుగా పేరు నమోదు చేసుకుని.. ఆమోదం పొందిన 15 రోజుల్లోనే ‘EPIC కార్డు’ (ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డు) డెలివరీ చేయనున్నారు.


ప్రస్తుతం ప్రతీ పోలింగ్‌ కేంద్రంలోనూ 1,500 మంది ఓటర్లు ఓటు వేసేందుకు అవకాశం కల్పించగా.. రద్దీని తగ్గించేందుకు దాన్ని 1,200కు తగ్గించనున్నారు.


సాధారణంగా బిహార్‌ ఎన్నికలను మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. ఈ సారి రెండు దశల్లోనే పూర్తి చేయనున్నారు.


ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ (ఈవీఎం) లపై పోటీ చేసే అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించనున్నారు.


పోటీ చేసే అభ్యర్థుల సీరియల్ నెంబర్‌ను కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేయనున్నారు.


రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి అధికారులను(బీఎల్‌ఓ) సులభంగా గుర్తించేందుకు వారికి అధికారికంగా ఐడీ కార్డులను జారీ చేయనున్నారు. బీఎల్‌ఓలకు ఢిల్లీలో ట్రైనింగ్.


ప్రతీ పోలింగ్ బూత్‌ వద్ద ఓటర్లు మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసే సౌకర్యాన్ని కల్పించనున్నారు.


ఎన్నికల ప్రక్రియకు మరింత పారదర్శకత కల్పిస్తూ అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ పూర్తిగా వెబ్‌కాస్టింగ్ కవరేజ్ ఉంటుంది.


ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎప్పటిక‌ప్పుడు ఎన్నిక‌ల స‌ర‌ళి గురించి అప్‌డేట్ ఇవ్వనున్నారు. ఓటింగ్ స‌మ‌యంలో ప్రతి 2 గంట‌ల‌కు ఒక‌సారి ఈ యాప్‌లో ఓటింగ్ డేటా అప్‌డేట్ అవుతుంది.


కొత్తగా ఓట‌ర్ ఇన్ఫర్మేష‌న్ స్లిప్‌ల‌ను ఇవ్వనున్నారు. వాటిపై ఓట‌రు ఐడీ నెంబ‌ర్ స్పష్టంగా క‌నిపిస్తుంది.


అభ్యర్థులను పోలింగ్‌ స్టేషన్ల నుంచి 100 మీటర్ల దూరం వరకే అనుమతించనున్నారు.


చివరి రెండు రౌండ్ల ఈవీఎంల లెక్కింపునకు ముందు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును తప్పనిసరి చేశారు. దీంతో రిజల్ట్స్‌ మరింత పారదర్శకంగా ఉంటాయని చెబుతున్నారు.


ఈవీఎంల డేటా సరిపోలడం లేదంటూ ఫిర్యాదులు వచ్చినపుడు వీవీప్యాట్‌ స్లిప్పులను తప్పనిసరిగా వెరిఫై చేయడం వంటి సరికొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్లు సీఈసీ ప్రకటించారు.


బూత్ లెవల్ ఆఫీసర్ల పారితోషికం రెట్టింపు. తొలిసారిగా ఈఆర్వో, ఏఈఆర్వోలకు గౌరవ వేతనం అందించనున్నారు.


తాజాగా ఎన్నికల ప్రక్రియలో తీసుకువచ్చిన ఈ నూతన సంస్కరణలు భారతదేశ ఎన్నికల నిర్వహణలో మరింత పటిష్టత, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకువస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa