ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల ఆలయంలో స్వర్ణతాపడం మాయం..! సిట్ విచారణకు హైకోర్టు ఆదేశం..

national |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 08:51 PM

కేరళలోని శబరిమల ఆలయంలో స్వర్ణతాపడం వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయ ద్వార పాలకుల సువర్ణతాపడం బరువు తగ్గడంతో వివాదం మొదలైంది. ఈ విషయంపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ద్వార పాలకుల బంగారు తాపడం విషయంలో జరిగిన అవకతవకలపై.. సోమవారం (అక్టోబర్ 6) కేరళ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ రాజా విజయరాఘవన్ వి, జస్టిస్ కేవీ జయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ట్రానెన్‌కోర్ దేవస్థానం బోర్డు విజిలెన్స్ టీమ్ జరిపిన ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలించిన అంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


ఎస్పీ ఎస్. శశిధరన్‌ను నేతృత్వంలో హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందం చేసే దర్యాప్తును అదనపు డీజీపీ హెచ్. వెంకటేష్ పర్యవేక్షిస్తారు. అయితే ఈ కేసులో దర్యాప్తును గోప్యంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మీడియా, ప్రజలకు వివరాలు వెల్లడించరాదని.. నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పింది. దర్యాప్తు నివేదికలను నేరుగా కోర్టుకే సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.


వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి స్పాన్సర్ చేసిన ద్వారపాలకుల స్వర్ణ తాపడాలను.. ఎలక్ట్రోప్లేటింగ్ కోసం 2019లో చెన్నైకి పంపారు. అ తర్వాత బంగారు తాపడాల బరువు తగ్గింది. ఇలా ఎందుకు జరిగిందో పరిశీలించాలని కోర్టు గతంలో టీడీబీ విజిలెన్స్ బృందాన్ని ఆదేశించింది. బంగారు పూత పనిని అప్పగించిన వ్యక్తి.. తాపడం తర్వాత మిగిలిపోయిన బంగారాన్ని ఒక అమ్మాయి పెళ్లికి ఉపయోగించవచ్చా అని అడుగుతూ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడికి ఇమెయిల్ పంపారని కోర్టు వెల్లడించింది. ఈ పరిశీలనల అనంతరం సిట్ దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.


ఇదీ వివాదం..


2019లో చెన్నై, 2025లో హైదరాబాద్‌లోని వర్క్‌షాప్‌ల్వో గోల్డ్ ప్లేటింగ్ కోసం స్వర్ణ తాపడాలను పంపించారు . అయితే వీటి నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఇటీవల టీడీబీ విజిలెన్స్ నివేదికలో తేలింది. బంగారం బరువులో వ్యత్యాసాలు వచ్చాయి. ఇక 2019లో ఆలయానికి తాను విరాళంగా ఇచ్చిన రెండు బంగారు తాపడాలు కనిపించడం లేదని ఉన్నికృష్ణన్ పొట్టి ఆరోపించిన తర్వాత వివాదం మరింత తీవ్రమైంది. టీడీబీ నిర్వహించిన గ్లోబల్ అయ్యప్ప సంగమం కార్యక్రమం జరగక ముందు స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి మాయమయ్యాయని ఉన్నికృష్ణన్ ఆరోపించారు. అయితే కనిపించకుండా పోయిన తాపడాలు ఉన్నికృష్ణన్ బంధువు ఇంట్లో టీబీడీ విజిలెన్స్ బృందం కొనుగొంది. దీంతో భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై నిరసనలు కూడా జరిగాయి. అయితే, ఉన్నికృష్ణన్‌తో పాటు ఎవరెవరు ఈ అవకతవకల్లో భాగం అయ్యారు అని లేల్చేందుకు కోర్టు సిట్ విచారణకు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa