ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ఎఫెక్ట్.. వైఎస్ జగన్‌కు షాకిచ్చిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 07:13 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనపై సందిగ్ధత కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ ఏడో తేదీన వైఎస్ జగన్.. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, వైసీపీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంఛార్జులు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఎనిమిదో తేదీన భీమవరం వెళ్తారు. అక్కడ వైసీపీ సీనియర్ నేత ముదునూరి ప్రసాదరాజు కుమారుడి పెళ్లి వేడుకలకు జగన్ హాజరవుతారు. అనంతరం అక్టోబర్ తొమ్మిదో తేదీన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వెళ్తారని వైసీపీ షెడ్యూల్ ప్రకటించింది. మాకవరపాలెంలోని భీమబోయినపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని వైఎస్ జగన్ సందర్శిస్తారని శనివారం వెల్లడించింది.


ఏపీ ప్రభుత్వం పీపీపీ పేరుతో గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే భీమబోయినపాలెంలోని మెడికల్ కాలేజీ నిర్మాణాలను వైఎస్ జగన్ పరిశీలించేలా కార్యక్రమం రూపొందించింది. అక్కడే మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడేలా టూర్ ప్లాన్ చేశారు. అయితే వైఎస్ జగన్ మాకవరం పర్యటనకు అనకాపల్లి జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ రోడ్ షోకు అనుమతి ఇవ్వలేమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. విశాఖ నుంచి మాకవరపాలెం వరకూ జగన్ రోడ్ షోకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ.. వైఎస్ జగన్ రోడ్‌షోకు అనుమతి ఇవ్వలేమని.. హెలికాప్టర్‌లో వచ్చేలా ప్లాన్ చేసుకోవాల వైసీపీ నేతలకు సూచించారు. మెడికల్ కాలేజీ వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ హెలికాప్టర్‌లో వచ్చేలా అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.


విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మాకవరపాలెం వరకూ వైఎస్ జగన్ 63 కిలోమీటర్ల మేర రహదారి మార్గంలో వచ్చేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారని ఎస్పీ వెల్లడించారు. అయితే ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్యమైన కూడళ్ల వద్ద జనసమీకరణ చేసి ప్రదర్శన నిర్వహిస్తారనే సమాచారం తమకు ఉందని ఎస్పీ వివరించారు. ఇలా చేస్తే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటుగా ప్రజలకు ఇబ్బందులు వస్తాయని అనకాపల్లి ఎస్పీ వివరించారు. అలాగే తమిళనాడులోని కరూర్‌లో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయిన విషయాన్ని ఎస్పీ గుర్తుచేశారు.


ఈ నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నామని.. అందుకే వైఎస్ జగన్ విశాఖపట్నం - మాకవరపాలెం రోడ్‌షోకు అనుమతి ఇవ్వలేమని అనకాపల్లి జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా విశాఖ నుంచి మాకవరపాలెనికి హెలికాప్టర్‌లో వచ్చే వైఎస్ జగన్ చొరవ తీసుకోవాలని ఎస్పీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనకు వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారు.. విశాఖ నుంచి మాకవరపాలెం రోడ్డుపై వెళ్తారా.. లేక హెలికాప్టర్‌లో వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa