ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని రైతులకు.. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల అప్పుడే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 07:19 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు దీపావళి పండగ శుభవార్త అందనుంది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను దీపావళి పండగకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజన తో కలిసి అమలుచేస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా ఆగస్ట్ నెలారంభంలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు రూ.7000 అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు రూ.2000లకు.. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5000 కలిపి.. సుమారు 47 లక్షల మంది రైతుల బ్యా్ంక్ ఖాతాలలో ఏడు వేల రూపాయలు చొప్పున జమ చేశారు.


ఈ క్రమంలోనే దీపావళి పండగ సమయంలో పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.దీంతో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా అప్పుడే రైతుల అకౌంట్లలో పడే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలైనప్పుడే.. అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో రైతులు అందరూ దీపావళి పండుగ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరోవైపు అక్టోబర్ 18వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. దీపావళి పండుగ అక్టోబర్ 20వ తేదీ కాగా.. 18వ తేదీన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ పదో తేదీన మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


అన్నదాత సుఖీభవ పథకం విషయానికి వస్తే.. రైతులకు పెట్టుబడిగా సాయంగా ఉండేందుకు ఏటా రూ.20 వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతోవైసీపీ రూ.13500 ఏటా అందివ్వగా.. ఆ మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట మేరకు ఆగస్ట్ నెలలో అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులను జమ చేశారు. ఈకేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకోని రైతులకు.. ఆ ప్రక్రియలు పూర్తి చేసిన వెంటనే రూ.7000 బ్యాంక్ అకౌంట్లలో జమచేశారు. తాజాగా ఇప్పుడు రెండో విడతలో మరో రూ.7000 అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa