భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నప్పటికీ, పొరుగు దేశాలకు విద్యుత్ ఎగుమతుల విషయంలో హిమాలయ దేశం నేపాల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై మధ్యలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు భారత్, బంగ్లాదేశ్లకు కరెంట్ విక్రయించి ఏకంగా 15 బిలియన్ల నేపాలీ రూపాయలు ఆర్జించింది.నేపాల్ ఇంధన శాఖ మంత్రి కుల్ మాన్ ఘిసింగ్ కార్యాలయం ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఇటీవల వరదల వల్ల దెబ్బతిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితిని సమీక్షించేందుకు లోడ్ డిస్పాచ్ సెంటర్ను సందర్శించిన అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. సుమారు 1000 మెగావాట్ల విద్యుత్ను పొరుగు దేశాలకు విక్రయించడం ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.దేశీయ అవసరాలు తీరిన తర్వాత మిగులు విద్యుత్ను ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ ద్వారా భారత్కు నేపాల్ విక్రయిస్తోంది. అంతేకాకుండా, హర్యానా, బీహార్ రాష్ట్రాలతో నేరుగా ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. మరోవైపు, భారత ట్రాన్స్మిషన్ వ్యవస్థను ఉపయోగించుకుని బంగ్లాదేశ్కు కూడా రోజుకు 40 మెగావాట్ల విద్యుత్ను ఎగుమతి చేస్తోంది.ఇటీవల సంభవించిన వరదల కారణంగా 32 జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ విద్యుత్ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడలేదని నేపాల్ విద్యుత్ అథారిటీ ప్రతినిధి రాజన్ ధాకల్ స్పష్టం చేశారు. "వరదల వల్ల దెబ్బతిన్న ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం తక్కువే. దానికి తోడు పండుగల సీజన్ కావడంతో దేశంలో విద్యుత్ వాడకం కూడా తగ్గింది. దీంతో ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగలేదు" అని ఆయన వివరించారు.ఒకప్పుడు తీవ్రమైన విద్యుత్ కోతలతో సతమతమైన నేపాల్, 2021 నుంచి మిగులు విద్యుత్ను భారత్కు ఎగుమతి చేస్తూ కీలక ఆదాయ వనరుగా మార్చుకుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2035 నాటికి 28,500 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి, అందులో 15,000 మెగావాట్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా, రాబోయే పదేళ్లలో 10,000 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేసేందుకు భారత్ ఇప్పటికే నేపాల్తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa