ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై చైనా ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయి: పాకిస్థాన్

international |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 10:04 PM

ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు ప్రతీకారంగా పాక్ కూడా భారత్‌పై ప్రతిదాడులు చేసింది. అనేక మంది సామాన్య పౌరుల ప్రాణాలను తీసింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను దాయాది దేశం సైన్యం వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంతో జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో తాము ఉపయోగించిన చైనా తయారీ ఆయుధాలు అద్భుతంగా పని చేశాయని ప్రకటించింది. ఈ వివాదాస్పద ప్రకటనను పాకిస్థాన్ సైనిక మీడియా విభాగమైన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్  డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.


భారత్‌తో జరిగిన ఘర్షణల గురించి ప్రస్తావిస్తూ.. ఇటీవల అనూహ్యంగా చైనా ఆయుధాలు బాగా పని చేశాయని తెలిపారు. భారత్‌కు చెందన ఏడు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. అంతేకాకుండా తమకు చెందిన ఒక్క యుద్ధ విమానం కూడా కోల్పోలేమంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే తాము సాంకేతికమైన ఆయుధాలను కల్గి ఉన్నట్లు వెల్లడించారు. కానీ మరోవైపు ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ఉపయోగించిన చైనా ఆయుధాలు ఏమాత్రం పని చేయలేకపోయాయని.. ఇటీవలే భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి సింగ్ తెలిపారు. అమెరికా తయారు చేసిన ఎఫ్-16, చైనా జేఎఫ్-17, జేఫ్-12, జేఫ్-13 పాక్ యుద్ధ విమానాలను కూల్చేశామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పాక్ కావాలనే అబద్దాలు చెబుతోందని.. స్వదేశంలో పరువు నిలుపుకోవడం కోసం ఇలాంటి కథలు వినిపిస్తోందని అన్నారు.


మే నెలలో జరిగిన ఆ నాలుగు రోజుల ఘర్షణలో పాకిస్థాన్ తొలిసారిగా చైనా తయారు చేసిన ఆధునిక ఆయుధాలైన పీఎల్-15 క్షిపణులు, హెచ్‌క్యూ-9పీ భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు, జేఎఫ్-17, జే-10 యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున ఉపయోగించింది. అయితే భారతదేశం వైమానిక రక్షణ వ్యవస్థల ముందు.. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాల ముందు ఈ చైనా పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఈ ఘర్షణలో భారత బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి, కాష్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వంటి స్వదేశీ ఆయుధాల సమర్థత స్పష్టంగా కనిపించింది. ఇది పాకిస్థాన్ సైనిక వ్యవస్థల కంటే భారతీయ సాంకేతికత ఉన్నతమైనదని నిరూపించింది.


పాకిస్థాన్ ఇప్పటికే సరిహద్దులు, రోడ్ల కార్యక్రమం పేరుతో చైనాకు దాదాపు ఉపగ్రహ దేశంలా మారిపోయి బిలియన్ల కొద్దీ అప్పులు చేసి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలోనే జే-10 యుద్ధ విమానాలు తయారయ్యే చెంగ్డు ప్రాంతంలో పర్యటించేందుకు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సెప్టెంబర్‌లో చైనా పర్యటనకు వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa