ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీ జన సురాజ్లో ఊహించని వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం 51 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కొద్దిసేపటికే పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే పట్నాలోని జన్ సురాజ్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సీనియర్ నేతలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారిని కాదని, క్షేత్రస్థాయిలో బలం లేని వారికి టికెట్లు కేటాయించారని అసంతృప్త నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జన్ సురాజ్ పార్టీ నాయకురాలు పుష్పా సింగ్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. "అన్ని పార్టీలను వదిలి ప్రశాంత్ కిశోర్ను నమ్మి జన్ సురాజ్లో చేరాం. ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఆయనతోనే ఉన్నాను. కష్టపడి పనిచేసిన వారికే టికెట్ ఇస్తామని మొదట చెప్పారు. కానీ ఇప్పుడు టికెట్ పొందిన వ్యక్తి కనీసం మా గ్రామానికి కూడా రాలేదు. మాకు న్యాయం జరగలేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సారన్ జిల్లాలోని బనియాపూర్ నుంచి శ్రవణ్ కుమార్ మహతోకు టికెట్ ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. తనను కాదని వేరే ఎవరినీ అక్కడి ప్రజలు గెలిపించరని ఆమె స్పష్టం చేశారు.ఇదే తరహాలో బెనిపట్టి నియోజకవర్గంలోనూ అసమ్మతి వ్యక్తమైంది. అక్కడ ఎప్పటినుంచో అవధ్ కిశోర్ ఝా పేరు పరిశీలనలో ఉండగా, చివరి నిమిషంలో మహ్మద్ పర్వేజ్ ఆలంకు టికెట్ కేటాయించడంపై ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నిరసనలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. బీహార్లో వ్యవస్థాగత మార్పు అనే లక్ష్యంతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆయన సమర్థించుకున్నారు. "కొందరు కార్యకర్తలకు టికెట్లు రాకపోవడం వల్ల అసంతృప్తి ఉండవచ్చు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేది కేవలం 243 మందే. బీహార్లో వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే మా లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జాబితాను సిద్ధం చేశాం" అని ఆయన వివరించారు. జన సురాజ్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో 7 రిజర్వ్డ్ స్థానాలు, 44 జనరల్, ఓబీసీ, ఈబీసీ, మైనారిటీ స్థానాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa