ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానసిక వ్యాధులపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 04:22 PM

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండ్లాస్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్ధినిలతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశా, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డి.ఎం.హెచ్.ఒ సుహాసిని ర్యాలీలో పాల్గొన్నారు. ఐఎంఏ హాల్ నుంచి ఏలూరు రోడ్, అప్సర థియేటర్ మీదుగా ఐఎంఏ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నేటి పోటీ‌ ప్రపంచంలో చాలా మంది‌ ఒత్తిడిని తట్టుకోలేక‌ పోతున్నారని.. విద్యార్థుల ప్రతిభను మించి‌ వారిపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఆలోచనల్లో‌ కూడా మార్పు రావాలని సూచించారు. మానసిక వ్యాధులతో బాధ పడేవారి సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రపంచంలో 90 కోట్ల మంది‌ మానసిక వ్యాధులుతో బాధ పడుతున్నారని మంత్రి వెల్లడించారు. వారిని ముందుగా గుర్తించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. మన దేశంలో 15 కోట్ల మంది మానసిక ఇబ్బందులతో బాధ పడుతున్నారని తెలిపారు. సమాజంపై కూడా వీరి‌ ప్రభావం చాలా ఉందన్నారు. ఆర్ధిక ప్రభావం కూడా ఒక ట్రిలియన్ డాలర్లుగా ఉందని అన్నారు. మానసిక వ్యాధులపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని వ్యాఖ్యానించారు. పిల్లలపై కూడా అనేక విధాలుగా ఒత్తిడి పెరుగుతోందన్నారు. యువత, చిన్న పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. 2021లో 8067 మంది ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa