ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల అయ్యప్ప బంగారం మాయం.. కేరళ హైకోర్టు సంచలన ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 08:03 PM

కేరళలో అయ్యప్పస్వామి కొలువుదీరిన శబరిమల ఆలయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అయితే గత కొన్ని రోజుల క్రితం.. శబరిమల బంగారు తాపడాలను మరమ్మతుల కోసం.. అనుమతి లేకుండా చెన్నైకి తరలించడం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు .. వెంటనే వాటిని ఆలయానికి తీసుకురావాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీబీడీ)కి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ బంగారు తాపడాల బరువుల్లో తేడా ఉండటం.. మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే కేరళ హైకోర్టు.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. తాజాగా విచారణ సందర్భంగా అయ్యప్ప బంగారం మాయం కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


అయ్యప్ప ఆలయంలోని గర్భగుడికి ముందు ఉండే ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు పూత పూసిన రాగి తాపడాలు ఉండేవి. అయితే మరమ్మతుల కోసం తీసుకెళ్లి తీసుకురాగా.. వాటి బరువు తగ్గినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. బంగారం లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఈ బంగారు మాయంపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ బంగారం మాయం వివాదంపై ఇప్పటికే కోర్టు.. సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిట్ నెలలోగా రిపోర్ట్ ఇవ్వాలని.. ఆ నివేదికను బహిర్గతం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.


శబరిమలలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలను మరమ్మతుల కోసం 2019లో తొలగించారు. కొత్త బంగారు పూత తాపడాలను ఇస్తానని ఉన్నికృష్ణన్‌ అనే దాత వాటిని తీసుకెళ్లి.. చెన్నైలోని ఒక సంస్థకు అప్పగించారు. 2019లో ఆ బంగారు తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు అధికారులు రికార్డుల్లో చేర్చారు. అయితే.. తమ వద్దకు తీసుకువచ్చినప్పుడు ఆ తాపడాల బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని చెన్నై సంస్థ చెప్పడం అసలు వివాదానికి కారణం అయింది.


అంతేకాకుండా.. శబరిమల ఆలయం నుంచి ఆ బంగారు తాపడాలను తీసిన 40 రోజుల తర్వాత వాటిని చెన్నై సంస్థకు అందించినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే కేరళ హైకోర్టు అనేక అనుమానాలను లేవనెత్తింది. ఒకేసారి తాపడాల బరువు 4.524 కిలోలు తగ్గడం ఏంటని ప్రశ్నించింది. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించిన కోర్టు.. వాటిని తిరిగి అమర్చినప్పుడు బరువును ఎందుకు చూడలేదని నిలదీసింది. అదే సమయంలో ముందుగా ఎలాంటి అనుమతి లేకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లడం పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa