అయోధ్యలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ ఇళ్లు కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు కూలిన శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఆ ఇంట్లోని సిలిండర్ లేదా కుక్కర్ లేదా బాణసంచా పేలి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫోరెన్సిక్ టీమ్ను రప్పించి.. ఆ ప్రాంతంలో ఆధారాలను సేకరిస్తున్నారు. మరోవైపు.. కాన్పూర్లో పేలుడు జరిగిన 24 గంటల్లోనే అయోధ్యలో ఈ పేలుడు సంభవించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయోధ్య జిల్లాకు సమీపంలోని ఉన్న గ్రామంలో గురువారం రాత్రి ఒక ఇంట్లో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రతకు ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. దీంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఇక శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేసి రెస్క్యూ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన అయోధ్య జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ పేలుడు ఎలా సంభవించింది అనే కారణాలపై మొదట్లో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాన్పూర్లో స్కూటర్ పేలుడు జరిగిన మరుసటి రోజే అయోధ్యలో ఈ ఘటన జరగడంతో తీవ్ర ఆందోళన కలిగించింది. కాన్పూర్లో స్కూటర్ పేలి 8 మంది గాయపడ్డారు. అయితే.. ప్రాథమిక నివేదికల ప్రకారం ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు లేదా కుక్కర్ పేలుడు అయి ఉండవచ్చని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ టికారాం ఫండే తెలిపారు. ఘటన ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందంతోపాటు.. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలుడు లేదా కుక్కర్ పేలుడుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే కచ్చితమైన వివరాలు వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని.. సహాయక, సహాయ నివారణ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు.. ఈ ఘటనపై స్పందించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. అయోధ్యలో పేలుడు కారణంగా 5 మంది మరణించడం హృదయ విదారకమని.. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa