ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీకి చేతికి మరో అధునాత అస్త్రం.. ఏంటీ ‘మార్ట్‌లెట్’ ప్రత్యేకత?

national |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 08:08 PM

భారత సైన్యానికి త్వరలోనే మరో అధునాతన అస్త్రం అందనుంది. రక్షణ రంగంలో పరస్పర విస్తృత సహకారం కోసం భారత్‌- యునైటెడ్ కింగ్డమ్ మధ్య 468 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా తేలికపాటి, బహుళ ప్రయోజనకర ‘మార్ట్‌లెట్‌’ క్షిపణులను భారత్‌కు యూకే అందజేయనుంది. దీంతో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం, యూకే, భారతదేశం మధ్య విస్తృత సంక్లిష్ట ఆయుధ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రస్తుతం దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.


ఐర్లాండ్‌కు చెందిన ‘థేల్స్‌ ఎయిర్‌ డిఫెన్స్‌’ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ క్షిపణులకు పురాణాలు, ఇతిహాసాల్లోని ‘మార్ట్‌లెట్‌’ అనే పక్షి పేరు పెట్టారు. ‘మార్ట్‌లెట్’ అంటే అవిశ్రాంత, అలుపెరగని పక్షి అని అర్థం. తేలికపాటి, బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ క్షిపణులను గగనతలం నుంచి గగనతలం, ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించవచ్చు. గగనతల భద్రతతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాలు వంటి సైనిక లక్ష్యాలను కూడా చేధించేలా వీటిని రూపొందించారు. లేజర్‌ బీమ్‌ గైడెన్స్‌ టెక్నాలజీతో తయారైన ఈ క్షిపణిని సైనికులు తమ భుజంపై ఉంచుకుని ప్రయోగించవచ్చు. అలాగే, యుద్ధ ట్యాంకులకు అనుసంధానం చేసి హెలీకాప్టర్లు, నౌకల నుంచి కూడా ఈ క్షిపణులను ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత. ఇవి ఇండియన్ ఆర్మీ చేతికి వస్తే సరిహద్దుల్లో గగనతల రక్షణ మరింత బలోపేతమవుతుంది.


భూ, గగనతలంలో ఆరు కిలోమీటర్ల పరిధిలోని ముప్పును ఈ క్షిపణులు ఎదుర్కొగలవు. 13 కిలోల బరువు ఉండే ఈ క్షిపణి శబ్దం వేగాన్ని మించి ఒకటిన్నర రెట్లు వేగంగా ప్రయాణించగలదు. 2019 నుంచి బ్రిటన్ సైన్యానికి అందుబాటులోకి వచ్చిన ఈ క్షిపణులను.. ప్రస్తుతం రష్యాపై దాడులకు ఉక్రెయిన్‌ వినియోగిస్తోంది.


భారత్, బ్రిటన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, కీర్ స్టార్మర్ మధ్య భేటీ తరువాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ‘‘ఈ ఒప్పందం భారత వైమానిక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా భారత రక్షణ ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చడమే కాకుండా, రెండు దేశాల మధ్య సంక్లిష్ట ఆయుధాలపై దీర్ఘకాలిక సహకారానికి కూడా మద్దతిస్తుంది ’’ అని పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, యూకేల మధ్య అధునాత ఆయుధ సహకారం విస్తరణకు ఒప్పందం కుదిరింది. థేల్స్, భారత్ డైనామిక్స్ లిమిటెడ్‌లు లేజర్ బీమ్ రైడింగ్ MANPADs (LBRM) సరఫరా చేసే ఒప్పందం సంతకం చేశాయి.


మరోవైపు, బ్రిటన్‌ లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్‌రాయిస్‌.. భారత నేవీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి కనబరిచింది. నేవీ అభివృద్ధి చేస్తున్న స్వదేశీ తొలి ఎలక్ట్రిక్‌ యుద్ధ నౌక డిజైనింగ్‌లో రోల్స్‌రాయిస్ భాగస్వామిగా చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ యుద్ధ నౌకకు హైబ్రీడ్‌ ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థలను ఆ సంస్థ అందించనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa