ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాస్క్‌లోని వేడి టీ తాగి.. నాలుగేళ్ల చిన్నారి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 06:48 PM

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంచినీళ్లు అనుకుని వేడి టీ తాగి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. యాడికిలో ఈ విషాదం చోటుచేసుకుంది. యాడికిలోని చెన్నకేశవస్వామి కాలనీలో రామస్వామి, చాముండేశ్వరి దంపతులు నివసిస్తున్నారు. వీరికి హృతిక్ అనే నాలుగేళ్ల కొడుకు, యశస్విని అనే ఏడాదిన్నర వయసు గల కూతురు ఉన్నారు. అయితే మూడు రోజుల కిందట హృతిక్ ఫ్లాస్క్‌లో ఉన్న టీని.. నీళ్లు అని తాగేశాడు. టీ బాగా వేడిగా ఉండటంతో బాధతో విలవిల్లాడిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు.. హృతిక్‌ను వెంటనే తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు.


అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం అనంతపురం వెళ్లాలని సూచించగా.. కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హృతిక్ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు, దీంతో ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోదిస్తోంది, అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోవటంతో.. ఆ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


కుమారుణ్ని హత్య చేసిన తల్లి..


మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో హత్యకు గురయ్యాడు. కన్నతల్లే కుమారుణ్ని హత్య చేసింది. రెడ్డివారిపల్లెకు చెందిన లక్ష్మయ్య, గంగులమ్మ దంపతులకు 27 ఏళ్ల హర్ధవర్దన్‌ అనే కొడుకు, మరో కుమార్తె ఉంది. కుమార్తెకు ఇప్పటికే పెళ్లైంది. లక్ష్మయ్య సొంతూర్లోనే ఉండగా.. గంగులమ్మ, హర్షవర్ధన్‌ను వెంటపెట్టుకుని ఉపాధి కోసం 20 ఏళ్ల కిందట హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో ఉండే ఉమానగర్‌కు వచ్చి ఉంటున్నారు. గంగులమ్మ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.


అయితే గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో నిద్రపోతున్న హర్షవర్ధన్‌ను .. గంగులమ్మ హత్య చేసింది. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి టవాల్ సాయంతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మిగతా ఇద్దరూ అక్కడి నుంచి పారిపోగా.. గంగులమ్మ ఇంట్లోనే ఉంది. శుక్రవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. యితే మద్యానికి బానిసగా మారిన హర్షవర్ధన్.. డబ్బుల కోసం వేధిస్తూ ఉండటంతోనే గంగులమ్మ హత్య చేసిందనే వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa