ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.1.45 కోట్ల హవాలా సొమ్ము లాక్కున్నారు,,,,పోలీసుల 10 మంది సస్పెండ్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 06:57 PM

మధ్యప్రదేశ్ ‌లో ఓ భారీ కుంభకోణం బయటికి వచ్చింది. హవాలా ముఠా నుంచి పోలీసులు డబ్బు కొట్టేసిన ఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. హవాలా డబ్బును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. కారులో హవాలా డబ్బును తరలిస్తుండగా.. పట్టుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్‌పై దాడి చేసి.. అందులో ఉన్న రూ.1.45 కోట్లను పోలీసులే తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఈ ఘటనలో భాగమైన 10 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు కారులో హవాలా సొమ్మును పంపిస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


సాధారణ తనిఖీల్లో బుధవారం రాత్రి పోలీసులు సియోని జిల్లాలోని సిలాదేహి అటవీ ప్రాంతంలో ఒక కారును ఆపారు. ఆ కారులో భారీగా హవాలా డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని కట్ని నుంచి మహారాష్ట్రలోని జల్నాకు మొత్తం రూ.1.45 కోట్ల హవాలా సొమ్మును తరలిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో ఆ డబ్బును విధుల్లో ఉన్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయం గురించి.. ఉన్నతాధికారులకు సమాచారం అందించకుండా వారే తీసుకున్నారు. ఇక ఆ కారు డ్రైవర్‌ను కొట్టి బెదిరించి అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది.


ఇక ఆ హవాలా డబ్బు పంపించిన బిజినెస్‌మెన్, ఆ కారు నడిపిన డ్రైవర్ కలిసి గురువారం స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జబల్‌పూర్) ప్రమోద్ వర్మ వెంటనే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హావాలా సొమ్మును కొట్టేసిన సంఘటనపై 3 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఐజీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా.. మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కైలాష్ మక్వానా.. ఎస్‌డీఓపీ పూజా పాండేను సస్పెండ్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చారు.


ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న పోలీసులు అధికారులను సియోని జిల్లా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌డీఓపీ)తో పాటు మొత్తం 10 మంది పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. బందోల్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్, ఎస్‌డీఓపీ ఆఫీస్ సిబ్బంది ఇదంతా చేసినట్లు సియోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ మెహతా వెల్లడించారు. సస్పెండ్ అయిన వారిలో బందోల్ స్టేషన్ ఇంఛార్జ్ అర్పిత్ భైరామ్ (సబ్ ఇన్‌స్పెక్టర్), హెడ్ కానిస్టేబుళ్లు మఖన్, రవీంద్ర ఉయికే.. కానిస్టేబుళ్లు జగదీష్ యాదవ్, యోగేంద్ర చౌరాసియా, రితేష్, నీరజ్ రాజ్‌పుత్, కేదార్, సదాఫాల్ ఉన్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa