రాష్ట్రంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా సమర్థించుకున్నారు. పేదలకు నాణ్యమైన, ఉచిత వైద్యాన్ని వేగంగా అందించాలన్నదే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వైసీపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఏ కార్యక్రమం చేపట్టినా పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.గత పాలకుల విధానాలను అనుసరిస్తే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 20 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదే పీపీపీ విధానంలో అయితే కేవలం రెండేళ్లలోనే నిర్మాణాలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చని ఆయన వివరించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అదనంగా 110 మెడికల్ సీట్లు లభిస్తాయని, వారి వైద్య విద్య కలను సాకారం చేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతల తీరుపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మీలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కానీ, అదే నాణ్యమైన వైద్య సేవలు పేద ప్రజలకు అందకూడదా" అని ఆయన నిలదీశారు. ప్రజలకు మంచి చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని, పీపీపీ విధానం ద్వారా పేదలకు మేలు జరుగుతుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa