రుషికొండ భవనాలు .. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్యం హయాంలో రుషికొండ భవనాలను నిర్మించారు. అయితే పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి.. పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఈ భవనాలను నిర్మించారని అప్పట్లో విపక్షంగా ఉన్న టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. దీంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రుషికొండ భవనాలను ఏం చేస్తారనేదీ ఆసక్తికరంగా మారింది. సుమారుగా రూ.452 కోట్లు ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా ఈ భవనాలు నిర్మించారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి16 నెలలవుతున్నా ఈ రుషికొండ ప్యాలెస్ మీద నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. రుషికొండ ప్యాలెస్ను ఎలా ఉపయోగించుకోవాలి.. ఆ భవనాలను ఎలా వినియోగంలోకి తేవాలనే దానిపై ఆగస్టు 28న మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల సమావేశమై రుషికొండ ప్యాలెస్ గురించి చర్చించింది. రుషికొండ మీద గతంలో పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహణలో ఓ రిసార్టు ఉండేది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే వీటిని కూల్చేసి.. రుషికొండ ప్యాలెస్ కట్టారని మంత్రులు అభిప్రాయపడ్డారు. అలాగే రుషికొండ ప్యాలెస్ కరెంటు ఛార్జీలు ఇతరత్రా నిర్వహణ ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.25 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రుషికొండ భవనాల్ని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయానికి వచ్చింది. ఈ సలహాలు, సూచనలు పరిశీలించాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ అంశం గురించి నివేదిక ఇద్దామని నిర్ణయించింది.
రుషికొండను ఏం చేద్దాం.. మీరు సలహా ఇవ్వొచ్చు..
ఈ క్రమంలోనే రుషికొండ ప్యాలెస్ను ఎలా వినియోగిస్తే బాగుంటుందో చెప్పాలంటూ ప్రజల నుంచి ఏపీ పర్యాటక శాఖ సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి వెల్లడించారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను rushikonda@aptdc.inకు మెయిల్ చేయాలని సూచించారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం కానున్నామన్న ఆమ్రపాలి.. వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. ఈ సలహాలు, అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించి. తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa