ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాలతో విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పరిశ్రమలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే
విశాఖపట్నంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్కు ఆదివారం శంకుస్థాపన జరిగింది. ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రుషికొండ ఐటీ పార్క్లోని హిల్ నెంబర్-3లో సిఫీ డేటా సెంటర్కు నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 3.6 ఎకరాల భూమి కేటాయించింది.
డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఈ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. 50 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ను అలాగే.. ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. రెండు దశలలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా సుమారుగా వేయి మందికి ఉపాధి దొరుకుతుందని అధికారులు చెప్తున్నారు. అలాగే విశాఖపట్నం గ్లోబల్ డిజిటల్ గేట్వేగా మారేందుకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుందంటున్నారు.
మరోవైపు ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడుల ఆకర్షణ కోసం నూతన పారిశ్రామిక విధానాలను అనుసరిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశం. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అందులో భాగంగా ప్రముఖ సంస్థలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయనుంది. అలాగే తాజాగా సిఫీ డేటా సెంటర్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇండియాతో పాటుగా సింగపూర్, మలేసియా,థాయ్లాండ్ , ఆస్ట్రేలియా వంటి దేశాల మధ్య డేటా ప్రాసెసింగ్ చేసేందుకు విశాఖను కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa