బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. మన వాళ్లు కొనడం మాత్రం ఆపడం లేదు. ఇప్పుడు మన దేశంలో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల పైనే ఉంది. భారతీయుల దగ్గర బంగారం నిల్వలు భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మన దేశంలో పలు ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలను గుర్తించారు. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ , కర్నూలు జిల్లా కూడా ఉంది. ఇక్కడ అక్టోబర్ నెలాఖరు నుంచి బంగారం ఉత్పత్తి మొదలు పెట్టనున్నారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా.. తుగ్గలి మండలం బొల్లవానిపల్లి, జొన్నగిరి, జీ.ఎర్రగుడి, పగిడిరాయి గ్రామ పరిసర ప్రాంతాల్లో సుమారు 597.82 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఏళ్ల తరబడి శ్రమ, ఎన్నో పరిశోధనల తర్వాత ఈ ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈక్రమంలో జియో మైసూర్ సర్వీసెస్ అనే ప్రైవేటు కంపెనీ.. ఈ నిక్షేపాలను వెలికితీసేందుకు ముందుకొచ్చింది. మైనింగ్ దిగ్గజం బి.ప్రభాకరన్ ఈ ప్రాజెక్టు బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.
ఇక్కడ ఉన్న బంగారం నిక్షేపాలను వెలికి తీయడం కోసం.. దాదాపు రూ.500 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్ ఈ నెలాఖరున లేదా నవంబర్ నెల ప్రారంభం నుంచి బంగారం ఉత్పత్తికి రెడీ అయ్యింది. మొదట్లో ఇక్కడ సంవత్సరానికి 500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని 1000 కిలోలకు పెంచాలని యోచిస్తున్నారు. ఇక్కడ బంగారం ఉత్పత్తి చేయడానికి కావాలసిన అన్ని చట్టబద్ధమైన అనుమతులు తీసుకున్న తర్వాతే.. ఇక్కడ 24 క్యారెట్ల పసిడిని ప్రాసెసింగ్ చేయనున్నారు.
కర్నూలు జిల్లాలోని ఈ ప్రాంతంలో 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా ఎన్నో సంవత్సరాల క్రితమే గుర్తించారు. ఈక్రమంలో 30 సంవత్సరాల క్రితమే జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ.. రైతుల వద్ద నుంచి భూమిని లీజుకు తీసుకుని.. ఇక్కడ సర్వేలు, పరిశోధనలు, డ్రిల్లింగ్ కూడా చేపట్టింది. ప్రారంభంలో రైతులకు ఎకరాకు రూ.ఎకరా రూ.4,500 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత లీజు మొత్తం పెంచుతూ వచ్చింది.
ప్రస్తుతం ఇక్కడ బంగారం వెలికితీసేందుకు గాను.. జియో మైసూరు సర్వీసెస్ కంపెనీ రైతుల వద్ద నుంచి భారీ మొత్తంలో భూమి కొనుగోలు చేసింది. ఎకరాకు రూ.12 లక్షల చొప్పున చెల్లించి ఇప్పటి వరకు 283 ఎకరాలు కొనుగోలు చేసింది. మిగతా భూమికి ఎకరాకు గాను సంవత్సరానికి రూ.18 వేల చొప్పున చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ కంపెనీలో ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఉపాధి లభించగా.. భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa