ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీలు, ఖైదీల మార్పిడి ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. దీంతో ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల అంతటా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాలో యుద్ధం ముగిసిందని అని ప్రకటించారు. ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
గాజా యుద్ధాన్ని ముగించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం ఇజ్రాయెల్కు బయలుదేరారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. ఈ పరిణామంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఈ యుద్ధం ముగిసింది. మీకు అర్థమైందా? ఇది నిజంగా ఒక చాలా ప్రత్యేకమైన సమయం. ప్రతి ఒక్కరూ ఒకేసారి సంతోషిస్తున్నారు. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ ప్రక్రియలో పాలుపంచుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఇకముందు మనం అద్భుతమైన సమయాన్ని చూడబోతున్నాం" అని ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని చెప్పిన ట్రంప్.. యూదులు, ముస్లింలు, అరబ్బులు అంతా ఐక్యంగా ఉండటం చూడటం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. గాజాలో శాంతి, స్థిరత్వం నెలకొనడానికి ఈ ఒప్పందం ఒక గొప్ప శుభపరిణామమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కచ్చితంగా కొనసాగుతుందని ఆయన నమ్మకంగా చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ ఇరు పక్షాలు కూడా ఈ పోరాటంతో తీవ్రంగా అలసిపోయాయి అని వ్యాఖ్యానించారు. ట్రంప్ చొరవతో కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచి పెట్టడానికి, అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించాయి.
ట్రంప్ ముందుగా ఇజ్రాయెల్ చేరుకుని పార్లమెంటులో ప్రసంగిస్తారు. ఆ తర్వాత బందీల కుటుంబ సభ్యులను కలుస్తారు. అక్కడి నుంచి నేరుగా ఈజిప్టు వెళ్లి.. షర్మ్ ఎల్-షేక్లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీ నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇక్కడే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఇందుకోసం ఆహ్వానం అందింది. ట్రంప్ సహా సిసీలు ప్రధాని మోదీని ఈజిప్టుకు రమ్మంటూ ఆహ్వానించారు. అయితే పలు కారణాల దృష్ట్యా మోదీకి ఇందుకు వెళ్లలేకపోతున్నట్లు తెలుస్తుండగా.. భారత దేశ ప్రతినిధిగా కేంద్ర మంత్రి కేవీ సింగ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa