ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి వైసీపీ మాజీ మంత్రి పేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 08:04 PM

ఏపీలో కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ సంచలన వీడియో కలకలం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్ధన్ వీడియోలో చెప్పుకొచ్చారు. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని ఆరోపించారు. అయితే ఎన్నికల తర్వాత ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... నిఘా పెరగడంతో కల్తీ మద్యం తయారీ ఆపేసినట్లు వివరించారు. అయితే జోగి రమేష్ ఆదేశాలతోనే మళ్లీ కల్తీ మద్యం తయారీ ప్రారంభించామని.. చంద్రబాబుకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతోనే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో కల్తీ మద్యం తయారీ ప్రారంభించినట్లు జనార్ధన్ సంచలన ఆరోపణలు చేశారు.


" జోగి రమేష్ ఆధ్వర్యంలోనే ఇంతకుముందు ప్రభుత్వంలో తెచ్చుకుని చేశా. టీడీపీ ప్రభుత్వం రాగానే ఆపేశాం. బాగా స్ట్రిక్ట్ అయ్యేటప్పటికీ అంతా ఆపేశాం. 2025 ఏప్రిల్‌లో జోగి రమేష్ మాట్లాడదాం రమ్మంటే.. వాళ్ల తమ్ముడి ద్వారా మాట్లాడాను. టీడీపీ ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలని.. మనకు అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుందన్నారు. గతంలో చేసేవాడివి కదా అని నాకు చెప్పారు. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నా. అయితే చంద్రబాబును చెడు చేసేందుకు చిత్తూరు జిల్లాలో ప్లాన్ చేద్దామన్నారు. అక్కడే ప్లాన్ చేయాలన్నారు. అక్కడ బాలాజీ ద్వారా మందు తయారీకి కావాల్సిన కెమికల్స్, అన్ని రెడీ చేసుకున్నాం. జోగి రమేష్ ఆదేశాలతోనే తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం" అంటూ జనార్ధన్ చెప్పుకొచ్చారు. సుమారు 9 నిమిషాల ఉన్న ఈ వీడియోలో జనార్ధన్ సంచలన ఆరోపణలు చేశారు.


మరోవైపు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారులు జరిపిన సోదాల్లో తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు బయటపడింది. ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇబ్రహీంపట్నంలో తనిఖీలు నిర్వహించగా.. భారీగా కల్తీ మద్యం బాటిళ్లు దొరికాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్ధన్‌ను ఏపీ ఎక్సైజ్ పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.


ఆఫ్రికాలో ఉన్న జనార్ధన్ రావు.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం వ్యవహారంలో జనార్ధన్ రావు సోదరుడు జగన్మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కల్తీ మద్యం వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. అలాగే కల్తీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ తీసుకువచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa