ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజస్వి యాదవ్‌పై పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 08:11 PM

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన ఆయన, తన జన్ సురాజ్ పార్టీ తరఫున ఈరోజు విడుదల చేసిన రెండో జాబితాలో కూడా తన పేరును చేర్చలేదు. ఇది రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తావిస్తోంది.జన్ సురాజ్ పార్టీ ఈరోజు 65 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 20 రిజర్వ్డ్ స్థానాలకు (19 ఎస్సీ, 1 ఎస్టీ), 45 జనరల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని వర్గాలకు అవకాశం కల్పించినట్లు పార్టీ వెల్లడించింది. ఈ జాబితాలో అత్యంత వెనుకబడిన తరగతుల  నుంచి 14 మంది, ఇతర వెనుకబడిన తరగతుల  నుంచి 10 మంది, రిజర్వ్డ్ వర్గాల నుంచి 11 మంది, మైనారిటీల నుంచి 14 మందికి చోటు కల్పించారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న హర్నాట్ స్థానం నుంచి కమలేశ్ పాశ్వాన్ అనే ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపడం గమనార్హం.ఈ సందర్భంగా పీకే మాట్లాడుతూ రెండో జాబితాతో కలిపి ఇప్పటివరకు మొత్తం 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. "తొలి జాబితాలో 51 మందిని, ఇప్పుడు 65 మందిని ప్రకటించాం. మిగిలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో 31 మంది అత్యంత బలహీన వర్గాలకు, 21 మంది ఓబీసీలకు, 21 మంది ముస్లింలకు చెందిన వారని ఆయన వివరించారు.అక్టోబర్ 9న విడుదల చేసిన 51 మందితో కూడిన తొలి జాబితాలోనే జన్ సురాజ్ పార్టీ పలువురు ప్రముఖులకు చోటు కల్పించింది. మాజీ కేంద్ర మంత్రి ఆర్.సి.పి. సింగ్ కుమార్తె లతా సింగ్, ప్రముఖ సోషలిస్ట్ నేత కర్పూరి ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్, భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే, ప్రముఖ గణిత శాస్త్రవేత్త కె.సి. సిన్హా వంటి వారు మొదటి జాబితాలో ఉన్నారు.బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటములతో పాటు ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa