పండుగల సీజన్ ప్రారంభమైంది. దేశమంతా దీపావళి, ఛఠ్ పూజ ఉత్సవాల వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా ప్రయాణాలు చేస్తున్నారు.ఈ నేపధ్యంలో భారతీయ రైల్వే ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీ తగ్గించేందుకు మరియు ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ఈ సారి రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.సోమవారం గుజరాత్లోని వల్సాడ్లో జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) రైజింగ్ డే పరేడ్లో పాల్గొన్న ఆయన, దేశవ్యాప్తంగా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైలు సర్వీసులు విస్తరించబోతున్నాయని తెలిపారు.మంత్రిగా ఉన్న కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ రైల్వేలో చారిత్రాత్మక మార్పులు జరిగినట్లు ఆయన చెప్పారు.గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సుమారు 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మించామని, దాదాపు 60,000 కిలోమీటర్ల వరకు నెట్వర్క్ను విద్యుదీకరించామన్నారు. ప్రస్తుతం 150 వందే భారత్, 30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందిస్తున్నాయి.రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 స్టేషన్ల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటివరకు 110 స్టేషన్ల పనులను పూర్తి చేశామని, మిగిలిన పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కవచ్’ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థను ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై ప్రధాన మార్గాల్లో వేగంగా అమర్చుతున్నామని తెలిపారు.ఇప్పటికే 1,200 లోకోమోటివ్లలో ఈ వ్యవస్థను ఇన్స్టాల్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి ఏడాది 7,000 కొత్త కోచ్లు తయారు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 3,500 జనరల్ కోచ్లను అదనంగా చేర్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 41 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని రాష్ట్రపతి పతకాలు, జీవన్ రక్షా పతకాలతో మంత్రి అశ్విని వైష్ణవ్ సత్కరించారు. ఆర్పీఎఫ్ సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa