ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రొఫెసర్ పై చేయి చేసుకున్న విద్యార్థి సంఘం నాయకురాలు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 05:24 PM

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విద్యార్థి సంఘం నాయకురాలు ఒకరు, ఏకంగా పోలీసుల ముందే ఓ ప్రొఫెసర్ పై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది.వివరాల్లోకి వెళితే... ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కాలేజీలో ఇటీవల విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి గెలుపొందగా, ఏబీవీపీ సభ్యులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే, గెలిచిన ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థిపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కాలేజీ క్రమశిక్షణా కమిటీ కన్వీనర్‌ అయిన ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌కు ఫిర్యాదు అందింది.ఈ ఫిర్యాదుపై చర్చించేందుకు ఈ నెల‌ 10న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) సంయుక్త కార్యదర్శి, ఏబీవీపీ నాయకురాలు దీపికా ఝా తన సహచరులతో కలిసి ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌ను కలిశారు. ఈ సమావేశంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన దీపికా, అక్కడే ఉన్న పోలీసుల ఎదుటే ప్రొఫెసర్ సుజిత్ కుమార్ చెంపపై కొట్టారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను పక్కకు లాగేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డీయూటీఏ) ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఒక విద్యార్థి నాయకురాలు ప్రొఫెసర్‌పై చేయి చేసుకోవడం దారుణమని పేర్కొంది. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa