దేశంలోని దిగ్గజ కంపెనీలు వరుసగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 రెండో త్రైమాసికం Q2 (జులై- సెప్టెంబర్) ఫలితాల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఐటీ దిగ్గజ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తర్వాత టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా అన్నీ వరుసగా ఫలితాల్ని ప్రకటించేశాయి. ఇప్పుడు ఇతర కంపెనీల వంతు వచ్చింది. అక్టోబర్ 17న దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద కంపెనీ.. దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించింది. ఇక్కడ మరోసారి రిలయన్స్.. మార్కెట్ అంచనాల్ని మించి రాణించడం విశేషం.
సమీక్షా త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ. 18,165 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నికర లాభం రూ. 16,563 కోట్లుగా ఉండగా.. ఇది 10 శాతం పెరిగింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం ఇదే సమయంలో రూ. 2.59 లక్షల కోట్లుగా వచ్చింది. కిందటేడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 2.35 లక్షల కోట్లుగా ఉండగా.. ఇక్కడ కూడా 10 శాతం వృద్ధి నమోదు చేసింది.
ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ విషయానికి వస్తే మాత్రం మార్కెట్ అంచనాలు తప్పడం గమనార్హం. ఇది రూ. 18,643 కోట్లుగా వచ్చింది. ఇక టాప్ లైన్.. అంచనాల్ని మించి రూ. 2.51 లక్షల కోట్లుగా నమోదైంది. స్థూల ఆదాయం కూడా వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి రూ. 2.83 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ ఎబిటా విషయానికి వస్తే.. అంటే ఇక్కడ వడ్డీ, పన్ను కలుపుకొని ఆదాయం చూస్తే రూ. 50,367 కోట్లుగానే ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన 15 శాతం ఎగబాకింది. ఎబిటా మార్జిన్ 17.8 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే 80 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
సెగ్మెంట్ల వారీగా చూస్తే.. జియో ప్లాట్ఫామ్స్ ఆదాయం 14.9 శాతం పెరిగి.. రూ. 7,379 కోట్లుగా నమోదైంది. జియో ఆర్పు (యూజర్ నుంచి నెలకు సగటు ఆదాయం) రూ. 211.4 కు పెరిగింది. అంతకుముందు ఇదే సమయంలో ఇది రూ. 195.1 గా ఉండేది. రిలయన్స్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 18 శాతం పెరిగింది. ఆయిల్ టు కెమికల్స్ విభాగం ఆదాయం స్వల్పంగా 3.2 శాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ ఆదాయం 2.6 శాతం తగ్గింది. ఫలితాల నేపథ్యంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర పుంజుకుంది. శుక్రవారం రోజు 1.49 శాతం పెరిగి రూ. 1419.10 వద్ద సెషన్ ముగించింది. ఇంట్రాడేలో రూ. 1423.30 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 19.17 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 1551 కాగా.. కనిష్ట ధర రూ. 1114.85 గా ఉంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa