ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలోని ఎంపీల అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:14 PM

దేశ రాజధాని దిల్లీ శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.


మధ్యాహ్నం సుమారు 1:20 గంటల ప్రాంతంలో దిల్లీలోని బిషంబర్ దాస్ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. తక్షణమే స్పందించిన అధికారులు దాదాపు 14 ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలానికి పంపించారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని ఒక అంతస్తులో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. ఈ నివాస సముదాయం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవనం కావడంతో.. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు అత్యంత వేగంగా సహాయక చర్యలను చేపట్టారు.


దాదాపు ఒక గంటకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారి భూపేందర్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఒకే ఫ్లాట్‌కు చెందిన భార్యాభర్తలు, ఒక పిల్లవాడితో సహా కొందరికి కాలిన గాయాలైనట్లు సమాచారం. వారికి వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరు, తన కుమార్తె పెళ్లి కోసం కొనుగోలు చేసిన నగలు, విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.


బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్ సముదాయం అత్యంత సున్నితమైన ప్రాంతంలో, పార్లమెంట్ భవనం నుంచి కేవలం 200 మీటర్ల దూరంలో, రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి ఎదురుగా ఉంది. అనేక మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ఇందులో నివాసం ఉంటున్నారు. ఈ నివాస సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2020 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ అగ్నిప్రమాదంపై కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పించారు. ఎంపీలు నివసించే అత్యంత సున్నితమైన ప్రాంతంలోనే అగ్నిమాపక భద్రతా లోపాలు ఉన్నాయని ప్రశ్నించారు. సమయానికి ఫైర్ ఇంజిన్లు చేరుకోలేదని, భవన నిర్వహణ ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.


అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అగ్నిప్రమాదం పార్లమెంట్ సభ్యుల నివాస ప్రాంగణంలో జరగడంతో దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa