టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రిలేషన్ ఈనాటిది కాదు.. కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర నుంచి వీరిద్దరి ప్రయాణం సాగింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ బయటపెట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత నుంచి కెప్టెన్గా సూర్య, కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్లో టీమిండియా పొట్టి ఫార్మాట్లో దూసుకుపోతోంది.
ఇటీవల సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “మా సంబంధం అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమలాంటిది. ఆయన సీనియర్ అన్నయ్యలా వ్యవహరిస్తారు. నేను కోల్కతా నైట్ రైడర్స్ తరఫున నాలుగేళ్లు ఆయన కెప్టెన్సీలో ఆడాను. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు కాలం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఆయనే కోచ్, నేనే టీమిండియా టీ 20 కెప్టెన్” అని చెప్పాడు.
జట్టులో నిర్ణయాలపై తాము కలసి పనిచేసే విధానాన్ని వివరించిన సూర్యకుమార్ “ఎక్కువసార్లు స్క్వాడ్ ఎంపిక సమయంలో గంభీర్, నేను ఎంచుకునే పదకొండు మంది ఆటగాళ్లు ఒక్కరే అవుతారు. ఎలాంటి విభేదాలు ఉండవు. మైదానంలో కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేను డగౌట్ వైపు చూస్తాను. ఆయన కేవలం తల ఊపుతారు, నాకు అర్థమైపోతుంది. అంత బలమైన అండర్స్టాండింగ్ ఉంది మా మధ్య. ఇప్పటివరకు అన్నీ అద్భుతంగా సాగుతున్నాయి” అని అన్నాడు.
గంభీర్ నేతృత్వంలో ఇప్పటికే టీమిండియా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్పై సిరీస్ విజయాలు సాధించింది. 2024లో జరిగిన 26 పూర్తి టీ 20ల్లో భారత్ 22 గెలవగా, రెండు మ్యాచ్లు సూపర్ ఓవర్లకు దారి తీశాయి. ఏడాది మొత్తం ఒక్క ఓటమి మాత్రమే ఎదురైంది. ఆసియా కప్ విజయం ఈ జంటకు మొదటి ప్రధాన ట్రోఫీగా నిలిచింది.
గంభీర్ ప్రభావం తన నాయకత్వ శైలిపై ఎంతో ఉందని సూర్యకుమార్ గుర్తు చేసుకున్నాడు. “మైదానంలో ధైర్యంగా ఉండటం, సహచరుల అభిప్రాయాలను గౌరవించడం ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించేవారు” అని అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa