ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారాన్ని తెగ కొంటున్న ఆర్బీఐ.. ఏకంగా రూ. 9 లక్షల కోట్లు

business |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 11:09 PM

అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో యూఎస్ డాలర్ పుంజుకుంటోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. పలు దేశాల కేంద్ర బ్యాంకులు.. సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉంటుందని.. బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ భద్రతకు బ్యాకప్‌గా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో విదేశీ మారకపు నిల్వల్ని పెంచుకోవడంలో భాగంగా కూడా బంగారాన్ని తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటున్నాయి. ఇక్కడ బంగారం ఎక్కువగా కలిగి ఉండటం ద్వారా.. ఇది డాలర్లలో క్రయవిక్రయాలు జరుపుకుంటుంది కాబట్టి.. అవసరమైన సమయంలో దీనిని విక్రయించి విదేశీ మారకపు నిల్వల్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. బంగారాన్ని వీలైనంత ఎక్కువగా కొనుగోలు చేయడం ద్వారా.. డాలరుపై పెద్దగా ఆధారపడకుండా.. సొంత కరెన్సీని స్థిరీకరించుకోవచ్చు.


ఈ క్రమంలోనే భారత కేంద్ర బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరుపుతోంది. ఇప్పుడు చరిత్రలో తొలిసారి భారత్‌లో బంగారం నిల్వలు 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. చరిత్రలో ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఆర్బీఐ.. ఇటీవల విదేశీ మారకపు నిల్వలకు సంబంధించిన డేటా విడుదల చేసింది.


బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటం వల్ల కూడా ఆర్బీఐ గోల్డ్ కొనుగోలు చేస్తోంది. మొత్తం భారత్‌లో బంగారం నిల్వలు ఇటీవల వారం వ్యవధిలోనే 3.595 బిలియన్ డాలర్లు పెరిగి విలువ అక్టోబర్ 10 నాటికి 102.365 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారత కరెన్సీలో చూస్తే.. ఏకంగా రూ. 9 లక్షల కోట్లకుపైనే ఉంటుంది.


>> అయితే ఇక్కడ బంగారం నిల్వలు పెరిగినా.. ఓవరాల్‌గా విదేశీ మారకం నిల్వలు మాత్రం తగ్గాయి. ఇది 2.18 బిలియన్ డాలర్లకుపైగా తగ్గి 697.784 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్‌ల్లో బంగారం నిల్వలు 14.7 శాతానికి చేరగా.. 1996-97 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత దశాబ్ద కాలంలో భారత్.. బంగారం నిల్వల్ని వేగంగా పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో విదేశీ మారకంలో అప్పుడు 7 శాతంగా ఉండగా.. ఇప్పుడు రెట్టింపు చేస్కొని ఏకంగా 15 శాతానికి పెంచుకోవడం విశేషం. ఇది కేంద్ర బ్యాంక్ బంగారం కొనుగోలు చేయడాన్ని.. ధరల పెరుగుదలను ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా గతేడాది కంటే ఈ సంవత్సరం.. ఆర్బీఐ బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa