ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుస పండగలతో.. 5 రోజులు బ్యాంకులు బంద్

business |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 11:14 PM

మనలో చాలా మందికి బ్యాంకులో ఎప్పుడో ఏదో అవసరం పడుతుందని చెప్పొచ్చు. చాలా మంది డబ్బులు జమ చేసేందుకు.. విత్‌డ్రా చేసుకునేందుకు.. ఇంకా ప్రభుత్వ పథకాల్లో చేరేందుకు.. కేవైసీ అప్డేట్ చేయడం కోసం.. లోన్ కోసం.. పాస్‌బుక్, చెక్‌బుక్ సేవల కోసం.. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో చేరేందుకు.. ఇలా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఇక చాలా మంది.. తమ తమ అవసరాల, ఉద్యోగ రీత్యా సిటీల్లో ఉంటుంటారు. బ్యాంక్ పని నిమిత్తం.. సొంత గ్రామాలకు వెళ్లాల్సి రావొచ్చు. ఇందుకోసం.. ముందుగా షెడ్యూల్ చేస్కొని.. ఆ ఒకటి, రెండు రోజుల కోసం వెళ్లాల్సి వస్తుంది. కానీ అదే సమయంలో బ్యాంక్ మూసివేసి ఉంటే.. మీ పనులకు ఆటంకం కలుగుతుంది. అందుకే.. బ్యాంకులు ఎప్పుడెప్పుడు పనిచేస్తాయి.. ఎప్పుడు మూసివేసి ఉంటాయనేది తెలుసుకోవడం ముఖ్యం.


ఇప్పుడు ధన్‌తేరాస్, దీపావళి సహా ఇతర రాష్ట్రాల స్థానిక పండగల్ని బట్టి బ్యాంకులకు ఒకటికి మించే సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో బ్యాంకులు ఎప్పుడు మూసివేసి ఉంటాయనేది చూద్దాం. దేశవ్యాప్తంగా ఇక్కడ అన్ని బ్యాంకులకు వరుస సెలవులు ఉండవని గుర్తుంచుకోవాలి. ఇది ప్రాంతాల్ని బట్టి మారుతుంటుంది. కొన్ని చోట్ల మాత్రమే వరుసగా బ్యాంకులు మూసివేసి ఉంటాయి.


 ధన్‌తేరాస్ సందర్భంగా అక్టోబర్ 18న బ్యాంకులకు హాలిడే లేదు.


అక్టోబర్ 19న ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.


అక్టోబర్ 20న దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు సహా త్రిపుర, గుజరాత్, మిజోరాం, కర్ణాటక, మధ్య ప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, గోవా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లో సెలవులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో నరక చతుర్దశి, కాళీ పూజ పండగలు కూడా ఉన్నాయి.


అక్టోబర్ 21న దివాళీ అమావాస్య, దీపావళి, గోవర్ధన్ పూజ సందర్భంగా.. బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంది.


అక్టోబర్ 22న బలిపాడ్యమి, లక్ష్మీ పూజ (దీపావళి), విక్రమ్ సంవత్ న్యూ ఇయర్ డే సందర్భంగా.. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లో బ్యాంకులకు హాలిడే ఉంది.


అక్టోబర్ 23న గుజరాత్, సిక్కిం, మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో బ్యాంకులకు సెలవు ఉంది. ఇక్కడ భాయ్‌దూజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ వంటి పండగల సందర్భంగా హాలిడే ఉంది.


వీటిల్లో గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్‌ల్లో ఆదివారంతో కలిపి 4 రోజులు బ్యాంకులకు హాలిడే ఉంది. వెస్ట్ బెంగాల్, కర్ణాటక సహా ఇంకొన్ని రాష్ట్రాల్లో 3 రోజులు సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సండేతో కలిపి 2 రోజులు బ్యాంకులకు హాలిడే ఉంది.


ఇక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు సహా.. ఏటీఎం, డిపాజిట్ మెషీన్లు వంటివి అందుబాటులోనే ఉంటాయని గుర్తుంచుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa