ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జార్ఖండ్‌ హైకోర్టులో జడ్జితో లాయర్ భీకర వాగ్వాదం.. వీడియో వైరల్

national |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 07:55 PM

సాధారణంగా కోర్టుల్లో న్యాయవాదుల మధ్య, వారి వద్దకు వచ్చే క్లయింట్ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కానీ ఓ న్యాయమూర్తికి, న్యాయవాదితో గొడవ జరగడం ఇప్పటి వరకు చూసుండం. అంటే కోపతాపాలు ఉండి.. సహనంగా నిరసన వ్యక్తం చేసి ఉండడం చూశాం కానీ.. నేరుగా న్యాయమూర్తిపైనే నోరు పారేసుకున్న వారిని ఎప్పుడూ చూసుండం. కానీ గత గురువారం ఝార్ఖండ్ హైకోర్టులో ఒక న్యాయమూర్తికి, న్యాయవాదికి మధ్య తీవ్రమైన వాదోపవాదం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) అవుతున్న సమయంలోనే న్యాయవాది మహేష్ తివారీపై క్రిమినల్ కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు. న్యాయవ్యవస్థలో అరుదుగా కనిపించే ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


అసలు వివాదం ఎలా మొదలైందంటే?


న్యాయవాది మహేశ్ తివారీ తన క్లయింట్ కోసం కొంత ఉపశమనం (రిలీఫ్) కోరారు. ఆ క్లయింట్ ఒక వితంతువు. ఆమె ఇంటి విద్యుత్ బిల్లు సుమారు రూ. 1.30 లక్షల బకాయిల కారణంగా విద్యుత్ శాఖ అధికారులు నిలిపివేశారు. దీన్ని కోర్టు నెంబర్ 24లో గత గురువారం రోజు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ కుమార్ విచారించారు. ఈసందర్భంగానే ఆ న్యాయవాది.. ఉపశమనం కోరుతున్న విధానం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. కోర్టు నియమ నిబంధనల ప్రకారం వాదన ఎలా ఉండాలో ఆయన వివరించబోయారు. "ఇది ఎలాంటి వాదన? మేము అన్యాయం చేస్తున్నామా? మీ కేసు కొట్టివేస్తే అన్యాయం జరిగిపోయిందా? ఇదేనా మీ వాదన?" అని జస్టిస్ కుమార్ ప్రశ్నించారు. ఈ న్యాయవాది ప్రవర్తనను, ఆయన వాదనలోని కోర్టు ధిక్కార ధోరణిని బార్ కౌన్సిల్ ఛైర్మన్ తప్పక గమనించాలని ఆయన అన్నారు.


సరిగ్గా ఈ సమయంలోనే వెనుక నిలబడి ఉన్న న్యాయవాది మహేష్ తివారీ కల్పించుకున్నారు. ఆయన కొన్ని అడుగులు ముందుకు వేసి.. చేయి పైకెత్తి మరీ హైకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి మాట్లాడారు. "నేను నా పద్ధతిలోనే వాదిస్తాను. మీరు చెప్పిన విధంగా కాదు. దయచేసి గుర్తుంచుకోండి... ఏ న్యాయవాదిని అవమానించడానికి ప్రయత్నించవద్దు. నేను మీకు ఈ విషయం స్పష్టంగా చెబుతున్నాను" అని అన్నారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ కుమార్ స్పందిస్తూ.. "కోర్టు అన్యాయం చేస్తుందని మీరు చెప్పలేరు" అంటూ ఘాటుగా బదులిచ్చారు. దీనికి న్యాయవాది "నేను చెప్పానా? దయచేసి రికార్డింగ్‌ను తనిఖీ చేయండి" అని జస్టిస్ కుమార్‌ను అడిగారు. అంతేకాకుండా తాను 40 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు వివరించారు.


దీని తర్వాత న్యాయవాది తివారీ కోర్టు హాలు నుండి బయటకు వెళ్లిపోయారు. ఆ దృశ్యాలలో పరిస్థితిని సద్దుమణగడానికి ఇతర న్యాయవాదులు ప్రయత్నించడం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సంఘటన జరిగిన వెంటనే.. హైకోర్టు న్యాయవాది తివారీపై క్రిమినల్ కోర్టు ధిక్కార కేసును నమోదు చేసింది. ఈ కేసు విచారణ నవంబర్ 11న జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa