ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి ప్రయాణికుడి వాచ్‌ను వెతికిచ్చిన రైల్వే సిబ్బంది

national |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 07:53 PM

ఒకసారి పోయిన వస్తువుపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే. బస్సులు, రైల్వే లాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అయితే పోగొట్టుకున్న వస్తువు దొరకడం దాదాపు అసాధ్యం. ల్యాప్‌టాప్‌లు, లాగేజీ బ్యాగులు వంటివి బస్సుల్లోనో, రైళ్లలోనో మర్చిపోతే వాటిని తిరిగి పొందడానికి ఒకటికి పదిసార్లు అధికారుల చుట్టూ తిరగాలి. వారిని తెగ బతిమిలాడాలి. రాత్రిపూట అయితే మనల్ని, మన సమస్యను కనీసం పట్టించుకోరు. కానీ మనకు చెందిన ఒక వస్తువు పోయిందని అలా ఫిర్యాదు చేయగానే, ఇలా మీ వస్తువు దొరికింది వచ్చి తీసుకోండి అని రిప్లై వస్తే ఎలా ఉంటుంది. వినడానికే అతిశయోక్తిలా, అసాధ్యంలా, మిషన్ ఇంపాజిబుల్‌లా అనిపిస్తుంది కదూ. కానీ ఒక ప్రయాణికుడికి అదే జరిగింది. ఇప్పుడదే వైరల్‌గా మారింది.


వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఒక వ్యక్తి తన వాచ్ పోయిందనని అర్ధరాత్రి 12కు ఫిర్యాదు చేస్తే.. 40 నిమిషాల్లోనే మీ వాచ్ దొరికిందని రైల్వే అధికారులు స్పందించారు. రైల్వే సిబ్బంది అంకితభావానికి ఆశ్చర్యపోయిన ఆ ప్రయాణికుడు తన అనుభవాన్ని ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఇప్పుడా ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.


ఓ ప్రయాణికుడు వందే భారత్ రైలులో ప్రయాణించి రాత్రి 11 గంటలకు చెన్నైలోని ఎగ్మూర్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇంటికి చేరుకున్నాక.. రైలులోని రెస్ట్ రూమ్‌లో తన చేతి వాచ్‌ను మర్చిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి 12.28 గంటల సమయంలో 'రైల్ మదద్' వెబ్‌సైట్‌లో తన పీఎన్‌ఆర్ నంబర్, కోచ్, సీటు వివరాలను నమోదు చేసి, వాచ్ పోగొట్టుకున్న విషయాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యకరంగా ఫిర్యాదు చేసిన మూడు నిమిషాలకే.. అంటే 12.31 గంటలకు, రైల్వే హెల్ప్‌లైన్ నుంచి ఆయనకు కాల్ వచ్చింది. ఫిర్యాదు వివరాలను వారు ధృవీకరించుకున్నారు. 12.34 గంటలకు మళ్లీ హెల్ప్‌లైన్ నుంచి ఒక ఎస్‌ఎంఎస్ కూడా వచ్చింది. అప్పటికి రైలు ప్లాట్‌ఫామ్‌ నుంచి యార్డ్‌కు వెళ్లిపోయింది. అయినప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కాల్ వచ్చి, తమ సిబ్బందిని యార్డ్‌కు పంపి తనిఖీ చేయిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు.


ఆ తర్వాత కేవలం 23 నిమిషాల వ్యవధిలోనే అంటే తెల్లవారుజామున 1.12 గంటలకు, ఆర్‌పీఎఫ్ నుంచి వాట్సాప్‌లో ప్రయాణికుడికి రెండు ఫొటోలు వచ్చాయి. ఆ ఫొటోల్లో ఉంది ప్రయాణికుడు పోగొట్టుకున్న వాచ్. నిమిషం తర్వాత అంటే 1.13 గంటలకు ఆర్‌పీఎఫ్ నుంచి మళ్లీ కాల్ చేసి, వాచ్ దొరికిన విషయాన్ని చెప్పారు. ప్రయాణికుడు పోగొట్టుకున్నది, అక్కడ దొరికింది ఒకటే వాచేనా అని నిర్ధారించుకున్నారు. మొత్తం మీద అర్ధరాత్రి ఫిర్యాదు చేసిన 45 నిమిషాల్లోపే రైల్వే సిబ్బంది వాచ్‌ను గుర్తించారు. ఈ సంఘటన రైల్వే ఉద్యోగులు ఎంత నిబద్ధతతో పనిచేశారో తెలియజేస్తుంది. వాచ్ పోవడం అనేది ప్రయాణికుడి పొరపాటే అయినప్పటికీ అర్ధరాత్రి పూట, తమకు ఏమాత్రం సంబంధం లేని ఒక వస్తువును వెతికి పట్టుకోవడం కోసం దాదాపు డజను మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు.


ఒకరు ఫిర్యాదును నమోదు చేసి, వెంటనే ఆర్‌పీఎఫ్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత రైలు ప్లాట్‌ఫామ్ నుంచి యార్డ్‌కు వెళ్లిందని తెలుసుకుని యార్డ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. యార్డ్‌లో ఉన్న సిబ్బంది రైలు బోగీలోకి వెళ్లి రెస్ట్‌ రూములో చూడగా వాచ్ కనిపించింది. దానిని ఫొటో తీసి తిరిగి కమాండ్ చైన్ ద్వారా ప్రయాణికుడికి పంపించి అది ఆయన వాచ్చే అని నిర్ధారించుకున్నారు. వెంటనే ఫిర్యాదును క్లోజ్ చేసి, హెల్ప్‌లైన్ ద్వారా ప్రయాణికుడికి సందేశం పంపారు. మరుసటి రోజు ఉదయం ఆ ప్రయాణికుడు స్టేషన్‌కు వెళ్లి.. వాచ్ కావాలని కోరుతూ ఒక లేఖ, టికెట్, ఆధార్ జిరాక్స్ కాపీలను ఇచ్చి, రిజిస్టర్‌లో సంతకం చేసి తన వాచ్‌ను తిరిగి తీసుకున్నారు.


ఈ అద్భుతమైన పనితీరుకుగాను దక్షిణ రైల్వే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగుల పనితీరుపై ప్రయాణికుడు ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని ముఖ్యంగా ఏ చిన్న సమస్య ఎదురైనా తక్షణమే ఫిర్యాదు చేయాలని దీని ద్వారా మరోసారి నిరూపితమైనట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa