ప్రకాశం జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపింది. డోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలో పెద్దపులి తిరుగుతోందన్న వార్తలు స్థానికులను భయపెడుతున్నాయి. గండిచెరువు సమీపంలో మేతకు వెళ్లిన రెండు ఆవులపై దాడి చేసి చంపేయటంతో స్థానికులు మరింత వణికిపోతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉఁడాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో గతంలోనూ పెద్దపులి సంచరం కలకలం రేపింది. అయితే అటవీ ప్రాంతం కావటంతో ఇక్కడ పులులు సంచరిస్తూ ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ఏపీ విషయానికి వస్తే పులుల సంచారం ఎక్కువగా నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంతో పాటుగా, పాపికొండలు వంటి అటవీ ప్రాంతాలలో ఉంది. అలాగే నల్లమల అటవీ ప్రాంతంతో పాటుగా, పల్నాడు, నంద్యాల, కాకినాడ, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలలో పులుల సంచారం వార్తలు అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అప్పుడప్పుడూ పులులు ఆంధ్రప్రదేశ్లోని అటవీ ప్రాంతాలకు వలస వస్తుంటాయి. పులుల సంచారం వార్తలు వచ్చినప్పుడు స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పులుల సంచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా వ్యవహరించాలనే దానిపై అటవీ శాఖ అధికారులు వారికి అవగాహన కల్పిస్తుంటారు.
మరోవైపు ఏపీలో పులుల సంచారం పెరగటానికి కూడా అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య పెరగటంతో పాటుగా.. పులులు కొత్త ప్రాంతాలను అన్వేషించే క్రమంలో అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అటవీ ప్రాంతంలో ఆహారం దొరక్కపోవటం, ముఖ్యంగా వేసవి కాలంలో ఆహారం కొరత, నీరు లభించకపోవటం వంటి కారణాలతోనే అటవీ ప్రాంతాలకు సమీపంలోని జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే అటవీ ప్రాంతాలకు సమీపంలో మానవ ఆవాసాలు పెరగడం కూడా ఓ కారణమనే వాదన ఉంది. ఏదేమైనా పులుల సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa