కేరళలోని ప్రముఖ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి చెందిన బంగారం, వెండి, ఏనుగు దంతాలు, రత్నాలు వంటి విలువైన వస్తువులు కొన్నేళ్లలో మాయమైనట్టు తాజాగా జరుగుతోన్న వరుస ఆడిట్లు వెల్లడించాయి. నిర్లక్ష్యం, అధ్వాన్నమైన నిర్వహణ కారణంగా ఆలయ సంపద ఎంత సులభంగా దుర్వినియోగానికి గురవుతుందో ఈ ఆడిట్లు బట్టబయలు చేశాయి. అయ్యప్పస్వామి ఆలయంలో బంగారం మాయం అంశంపై దుమారం రేగుతోన్న వేళ, గురువాయూర్ ఆలయ బోర్దు నిర్వహణలోపం వెలుగులోకి రావడం గమనార్హం. 2019–20, 2020–21 నాటి రాష్ట్ర ఆడిట్ విభాగం నివేదికల ప్రకారం.. ఆలయానికి అపారమైన సంపద, పవిత్రత ఉన్నప్పటికీ.. బలహీనమైన పరిపాలన వ్యవస్థలు దుర్వినియోగానికి అనుకూలంగా ఉన్నాయని తేలింది. ఏనుగు దంతాలు, దంత వస్తువుల నిర్వహణ చేపట్టే గురువాయూర్ దేవస్థానం పరిధిలోని పున్నతూర్ కొట్ట ఎలిఫెంట్ శాంక్చురీ ఈ లోపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది.
2019–20 ఆడిట్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 522.96 కిలోల ఏనుగు దంతాలు వివిధ వస్తువుల తయారీకి వినియోగించారు. వాటిలో ఒక్క కిలో కూడా అటవీ శాఖకు చట్టపరంగా అప్పగించలేదు. దీనికి సంబంధించిన మహజరు రసీదులు కూడా లేవు. ‘ఫారెస్ట్స్ అసిస్టెంట్ కన్జర్వేటర్ లేఖ ప్రకారం.. దేవస్థానం తన వద్ద ఉన్న దంతాలు, దంతపు చిప్స్ వివరాలు పది రోజుల్లో అందజేయాలని ఆదేశించారు.. కానీ వాటి వివరాలను ఇవ్వలేదు సరికదా వాటిని అటవీ శాఖకు అప్పగించలేదు’ అని ఆడిట్ నివేదిక ఆరోపించింది. ఇది దేవస్థానం పాలనా యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఈ అంశంపై గురువాయూర్ దేవస్థానం బోర్డు చైర్మన్ వీకే విజయన్ స్పందిస్తూ.. బోర్డు అధికారం చేపట్టకముందు ఇది జరిగిందని అన్నారు. దీనిపై కోర్టు నోటీసులకు కూడా తగిన వివరణ ఇచ్చామని అన్నారు. ఆలయం లోపల డబుల్ లాక్ రిజిస్టర్, స్వామివారి దైనందిన పూజలకు వినియోగించే బంగారం, వెండి వస్తువులను ట్రాక్ చేసే రిజిస్టర్ పరిశీలనలో అనేక లోపాలు వెలుగుచూశాయి. పూజలకు వినియోగించిన తరువాత తిరిగి ఇచ్చిన వస్తువులు బరువు తగ్గాయి. ఒక వెండి పాత్ర పది నెలల్లోనే 1.19 కిలోలు, ఇంకో దీపపు కుందు వందల గ్రాములు బరువు తగ్గిపోయాయి. కొన్ని సందర్భాల్లో అసలు వస్తువు స్థానంలో వేరొకటి అప్పగించారు. బంగారు కిరీటం స్థానంలో వెండిది, 2.65 కిలోల వెండి పాత్ర స్థానంలో 750 గ్రాముల పాత్ర ఇచ్చారు. అయినప్పటికీ, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
భక్తులు సమర్పించిన 17 బస్తాల మంజడికూరు అదృశ్యమైంది. ఈ బస్తాలను కిలోకు రూ.100 చొప్పున వేలంలో దక్కించుకున్నా ఆ వ్యాపారి వాటిని తీసుకెళ్లలేదు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్లో ఆరోగ్య శాఖ సిబ్బంది దేవస్థానం ట్రాక్టర్లో వాటిని లోడ్ చేస్తున్నట్లు రికార్డయ్యింది. స్థలభావం కారణంగా వాటిని సమీప గొడౌన్లకు తరలించామని అధికారులు చెప్పినా, తరువాతి రికార్డుల్లో వాటిని ఎక్కడ ఉంచారో లేదా మళ్లీ వేలంలో చేర్చారో లేదో స్పష్టత లేదు.
అలాగే భక్తులు ఇచ్చిన భారీ విరాళాలు, విలువైన వస్తువులు అధికారిక రిజిస్టర్లలో నమోదు చేయలేదు. రాగి, కంచు, పంచలోహ వస్తువుల లెక్కలు 2016 నుంచే నిలిచిపోయాయి. 2022లో పాలక్కాడ్కు చెందిన భక్తుడు సమర్పించిన, దాదాపు రూ.15 లక్షల విలువైన కంచు పాత్రకు రసీదు ఇవ్వకపోవడమే కాదు రిజిస్టర్లో నమోదు చేయలేదు.
ముఖ్యంగా 1978 గురువాయూర్ దేవస్థానం చట్టం 1980 నియమావళి ప్రకారం ఏటా ఆలయంలోని అన్ని విలువైన వస్తువుల భౌతిక ధ్రువీకరణ జరగాలి. కానీ గత నాలుగు దశాబ్దాలుగా అలాంటి ప్రక్రియ ఏదీ జరగలేదని ఆడిటర్లు పేర్కొన్నారు. 2020–21 ఆడిట్ నివేదిక కూడా ఇదే పునరావృతం చేసింది. అంటే ఇది ఒక్కసారి జరిగిన పొరపాటు కాకుండా సుదీర్ఘ పరిపాలనా వైఫల్యమని నిర్ధారించింది.
చట్టం ప్రకారం దేవస్థానం నిర్వహణ కమిటీ ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి భౌతిక పరిశీలన నివేదికను కమిషనర్కు సమర్పించాలి. 2009లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ బాధ్య చీఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ది. అయినప్పటికీ 2020–21 ఆడిట్లో ఈ ధ్రువీకరణ జరగలేదని, బంగారం, వెండి వివరాలు సమర్పించలేదని, 2023 మార్చి, జులై నెలల్లో ఆడిట్ శాఖ దీనిపై నోటీసులు పంపినా కూడా స్పందించలేదని తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa