ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీకే శివకుమార్‌తో కిరణ్ మజుందార్ షా భేటీ,,,బెంగళూరు రోడ్లపై తీవ్ర మాటల యుద్ధం..

national |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 07:01 PM

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు నగరంలో రోడ్లు, మౌలిక సదుపాయాల దుస్థితిపై ఇటీవల కర్ణాటక మంత్రులతో బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షాకు.. తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. పలువురు వ్యాపారవేత్తలు కిరణ్ మజుందార్ షా కు మద్దతు పలికారు. మరికొందరు.. ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో కిరణ్ మజుందార్ షా సమావేశం కావడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ భేటీ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.


కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. తన మేనల్లుడి వివాహానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను ఆహ్వానించడానికి కిరణ్ మజుందార్ షా.. వారి ఇళ్లకు వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇటీవల మంత్రులతో బెంగళూరు రోడ్లు , మౌలిక సదుపాయాల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగిన వెంటనే ఈ సమావేశాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక డీకేఎస్‌తో భేటీ తర్వాత కిరణ్ మజుందార్ షా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం.


కానీ ఈ భేటీ గురించి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశారు. బెంగళూరు అభివృద్ధి, ఆవిష్కరణలు, కర్ణాటక అభివృద్ధికి సంబంధించి మార్గంపై కిరణ్ మజుందార్ షాతో చర్చ జరిగిందని డీకే శివకుమార్ వెల్లడించారు. గతంలో బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై కిరణ్ మజుందార్ షా విమర్శలు చేసినపుడు డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. గతంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలను ఎందుకు లేవనెత్తలేదని డీకే శివకుమార్ ప్రశ్నించారు. కిరణ్ మజుందార్ షా విమర్శల వెనుక వ్యక్తిగత ఎజెండా ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.


డీకే శివకుమార్ చేసిన ఆరోపణలను కిరణ్ మజుందార్ షా తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీ, జేడీఎస్ పాలనలో కూడా క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలను విమర్శించానని తేల్చి చెప్పారు. రోడ్లను శుభ్రం చేసి, పునరుద్ధరించడమే తమ అజెండా అని.. చాలా స్పష్టంగా ఉందని ఆమె బదులిచ్చారు. ఇక ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్ పాయ్ వంటి ఇతర బిజినెస్‌మెన్‌లు కూడా బెంగళూరు రోడ్ల దుస్థితిపై తమ గళం వినిపించారు. గుంతలు లేని రోడ్లు మనకు ఉండలేవా.. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని కాదని.. 200 ఏళ్లుగా జరుగుతున్న పని అని మోహన్‌దాస్ పాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వంటి సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని కిరణ్ మజుందార్ షా నరేంద్ర మోదీని ప్రశ్నిస్తారా అని కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ ప్రశ్నించారు. అయితే తనకు కావలసిందల్లా బెంగళూరు నగరంలో చెత్త తొలగింపు, రోడ్ల పునరుద్ధరణ అని కిరణ్ మజుందార్ షా కౌంటర్ ఇచ్చారు. ఇది గ్రేటర్ బెంగళూరు అథారిటీ చేయాలని.. ఈ పనిలో జాప్యం, నాసిరకం పనికి ప్రభుత్వ మంత్రులు వారిని బాధ్యులను చేయాలని.. ఈ విషయంలో ప్రభుత్వం, ప్రజలు ఒకే తాటిపై ఉండాలని గట్టిగానే సమాధానం ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa