సాధారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా బోనస్లు ఇస్తాయి. ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు దోహదం చేస్తాయి. అయితే కొన్ని కంపెనీల పాలసీలు వేరుగా ఉంటాయి. వివిధ కారణాల వల్ల ఉద్యోగులకు బోనస్ ఇవ్వలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితే ఓ కంపెనీకి ఎదురైంది. దీంతో ఉగ్యోగులకు సరిగా దీపావళి బోనస్ ఇవ్వలేదు. దీనికి నిరసనగా ఉద్యోగులు చేసిన పనికి ఆ కంపెనీ.. తలపట్టుకున్నట్లు అయింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
శ్రీ సైన్ & దాతర్ అనే కంపెనీ ఉత్తర్ప్రదేశ్లోని ఫతేహాబాద్ టోల్ ప్లాజాను నిర్వహిస్తోంది. అందులో 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే వారికి దీపావళి బోనస్గా రూ. 1100 మాత్రమే అందించింది కంపెనీ. ఇంత తక్కువ బోనస్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగులు. అనతంరం కంపెనీపై నిరసనకు దిగారు. అందులో భాగంగా టోల్ప్లాజా గేట్లు అన్ని తెరిచి ఉంచారు. దీంతో వేలాది వాహనాలు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై.. సోమవారం టోల్ ఛార్జీలు చెల్లించకుండా వెళ్లాయి.
రంగంలోకి పోలీసులు..
ఈ విషయం తెలుసుకున్న టోల్ ప్లాజా యాజమాన్యం.. ఇతర టోల్ప్లాజాల నుంచి వర్కర్లను తెప్పించి పని చేయించుకోవాలని ప్రయత్నించింది. అయితే వారిని.. నిరసన చేస్తున్న ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నిరసనతో సాధారణ టోల్ కార్యకలాపాలతో పాటు ట్రాఫిక్కు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంపెనీ అధికారులకు, ఆందోళన చేస్తున్న కార్మికులకు మధ్య రాజీకి ప్రయత్నించారు.
మెరుగైన పని పరిస్థితుల కల్పిస్తామని టోల్ అధికారులు సిబ్బందికి హామీ ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి చర్చలకు సిద్ధమని తెలిపారు. ఈ పరిస్థితికి తక్షణ పరిష్కారంగా 10 శాతం జీతం పెంచుతామని టోల్ కంపెనీకి చెందిన సీనియర్ అధికారులు ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. దీంతో తిరిగి విధుల్లోకి చేరడానికి ఉద్యోగులు అంగీకరించారు. దాదాపు 4 గంటల అంతరాయం తర్వాత టోల్ కార్యకలాపాలను పునరుద్ధరించారు.
అందుకే ఫుల్ బోనస్ ఇవ్వలేదు..
మరోవైపు, ఉద్యోగులకు తక్కువ బోనస్ ఇవ్వడంపై శ్రీ సైన్ & దాటర్ కంపెనీ స్పందించింది. తాము మార్చిలో మాత్రమే ఈ టోల్ ప్లాజా కాంట్రాక్టు తీసుకున్నామని చేసుకున్నామని తెలిపింది. అందుకే పూర్తి సంవత్సరానికి బోనస్ను అందించలేదని పేర్కొంది.
ఎక్కువ నష్టం..
గతేడాది ఈ టోల్ ప్లాజా ఉద్యోగులకు రూ. 5000 బోనస్ ఇచ్చారు. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ వేస్తారని ఉద్యోగులు భావించారు. కానీ రూ. 1100 మాత్రమే వేయడంతో అసంతృప్తికి గురయ్యారు. అయితే టోల్ గేట్లు 4 గంటలు ఉచితంగా తెరవడం వల్ల.. ఉద్యోగులు డిమాండ్ చేసిన బోనస్ కంటే.. చాలా ఎక్కువ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీ తిక్క కుదిరిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa