దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులను ఉద్దేశించి ప్రత్యేక లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగానే దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తన లేఖలో రామమందిరం నిర్మాణం, ఆపరేషన్ సిందూర్, మావోయిస్టుల లొంగుబాటుతో పాటు అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మాణమైన తర్వాత జరుపుకుంటున్న రెండో దీపావళి ఇది అని ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. "ధర్మాన్ని ఎల్లప్పుడూ కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించారు. అంతేకాక, అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఆయనే ప్రసాదిస్తారు" అని ఆయన తెలిపారు.
కొద్ది నెలల క్రితం ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు శ్రీరాముడే ప్రధాన స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత ధర్మాన్ని సంరక్షించడంతో పాటు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి విజయవంతంగా ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉందని ప్రధాని తెలిపారు. మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాల్లో, మారుమూల ప్రాంతాలలో కూడా ఈరోజు దీపావళి వెలుగులు నిండుగా ప్రకాశిస్తున్నాయని చెప్పారు. "మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో.. అనేక మంది హింసా మార్గాన్ని విడిచి పెట్టి, జన జీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన ఘటనలను మనం ఇటీవల చూశాం. తమ ఆయుధాలను వీడి, శాంతియుత జీవితాన్ని గడపడానికి వారు ముందుకు రావడం దేశానికి ఒక గొప్ప విజయం" అని మోదీ ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికారు.
ఈ శుభసందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను కూడా ప్రధాని తన లేఖలో గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరిందని.. తద్వారా పండుగల సందర్భంగా వారికి ఆర్థిక భారం తగ్గిందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేసి, తద్వారా స్థానిక పరిశ్రమలను, స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేశంలోని అన్ని భాషలను, సంస్కృతులను గౌరవించాలని కోరారు. పండుగలు, పర్వదినాలు ఉన్నా లేకపోయినా నిత్యం పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
ఆహారంలో నూనె వాడకాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతిరోజూ యోగా చేయాలని తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ మన దేశాన్ని 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యం వైపు బలంగా నడిపిస్తాయని ప్రధాని మోదీ తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa