ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేషన్ వేయగానే ఆర్జేడీ అభ్యర్థి అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 07:11 PM

బీహార్ శాసనసభ ఎన్నికల వేళ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి చెందిన సత్యేంద్ర సా.. ససారం అసెంబ్లీ స్థానం నుంచి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన కొద్దిసేపటికే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 20 ఏళ్ల కిందినాటి ఓ బ్యాంకు దోపిడీ కేసులో ఈ అరెస్టు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సత్యేంద్ర సాపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు కూడా వెల్లడించారు.


సత్యేంద్ర సా నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీతో వెళ్లారు. అయితే అప్పుడే అక్కడకు వచ్చిన పోలీసులు ఒక్కసారిగా ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడే ఉన్న ఆయన మద్దతుదారులంతా షాక్ అయ్యారు. అసలు ఈ అరెస్టు గురించి తాము ఏమాత్రం ఊహించలేకపోయామని చెప్పారు. అరెస్టు జరిగిన తీరును రోహ్‌తాస్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ అధికారి వివరిస్తూ.. "సత్యేంద్ర సా ససారం సీటు కోసం నామినేషన్ పత్రాలు సమర్పించడానికి సర్కిల్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకోగానే.. ఝార్ఖండ్ పోలీస్ అధికారులు అక్కడికి వచ్చారు. ఆయనపై పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేయడానికే వారు వచ్చారు. ఆయనకు నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చాం. కానీ ఆ వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు" అని తెలిపారు.


 సత్యేంద్ర సా అరెస్టుకు దారితీసిన కేసు వివరాలను ఝార్ఖండ్ పోలీసులు స్పష్టం చేశారు. ఆయన ఝార్ఖండ్‌లోని గర్వా జిల్లా చిరౌంజియా మోర్ వద్ద 2004లో జరిగిన బ్యాంకు దోపిడీ కేసులో నిందితుడుగా ఉన్నారు. గర్వాలోని సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అధికారి సునీల్ తివారీ మాట్లాడుతూ.. ఈ కేసులో సత్యేంద్ర సాపై 2018లోనే శాశ్వత వారెంట్ జారీ అయిందని గుర్తు చేశారు. పోలీస్ రికార్డుల ప్రకారం.. దోపిడీ, బందిపోటు, ఆయుధ చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన 20కి పైగా కేసులు ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.


ఈ ఎన్నికల్లో 'ఇండియా' (INDIA) కూటమి అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేసిన వెంటనే అరెస్టు కావడం ఇది మూడో సంఘటన. ఇంతకు ముందు CPI(ML) లిబరేషన్ పార్టీకి చెందిన భోరే అభ్యర్థి జితేంద్ర పాశ్వాన్, దరౌలీ అభ్యర్థి సత్యదేవ్ రామ్ కూడా నామినేషన్ పత్రాలు సమర్పించిన వెంటనే అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులను CPI(ML) లిబరేషన్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇవి రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అని ఆరోపించింది. ఇండియా కూటమికి పెరుగుతున్న ఆదరణ చూసి.. తప్పుడు కేసులు బనాయించి మరీ వారిని అరెస్ట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పుకొచ్చింది. మొత్తం 243 స్థానాలు గల బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6 మరియు 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీన ఫలితాలను ప్రకటించబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa