ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై బిగ్ అప్‌డేట్.. అధికారులు కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 08:20 PM

భారత్, అమెరికాలు వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరగా ఉన్నాయని ప్రభుత్వ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఇరు దేశాలూ తమ వాణిజ్య ఒప్పందం వివరాలను సమగ్రంగా సవరించి, తుది రూపు దాల్చే దిశగా కృషి చేస్తున్నాయని కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించి భారత్, అమెరికాలు ఐదు దఫాలుగా చర్చలను పూర్తిచేశాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. రాబోయే నెలల్లో రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని భారత్ నిలిపివేస్తుందని, ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటిచ్చారని గత కొన్ని రోజులుగా ట్రంప్ అంటున్నారు. ఇదే సమయంలో రష్యాకు చెందిన చమురు సంస్థలు రోసనెఫ్ట్, లుకొయిల్‌పై గురువారం అమెరికా అధ్యక్షుడు ఆంక్షలు విధించారు.


 ప్రభుత్వ అధికారులు పీటీఐతో మాట్లాడుతూ.. భారత్, అమెరికాలు చాలా అంశాల్లో ఉమ్మడి అవగాహనకు వచ్చాయని తెలిపారు. ‘ఒప్పందం దాదాపు చివరి దశలో ఉంది’అన్న ఆ అధికారి.. ఇరుదేశాల మధ్య ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు చాలా స్పల్పమైనే ఉన్నాయని అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతున్నాయని సంకేతాలు ఇచ్చారు. చాలా ఆంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చామని ఆయన వివరించారు. మరోవైపు, అమెరికా సుంకాలను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. వాణిజ్య చర్చల్లో దీనిపై ప్రతిపాదన వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.


ఇదే సమయంలో వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. భారత్ తొందరపడి ఎటువంటి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయబోదని తెలిపారు. ఐరోపా సమాఖ్య, అమెరికాతో సహా వివిధ దేశాలతో వాణిజ్య చర్చలు కొనసాగుతోన్నాయని ధ్రువీకరించారు. బెర్లిన్‌‌లో జర్మనీతో జరిగిన చర్చల్లో ‘‘ఐరో సమాఖ్యతోనూ, అమెరికాతోనూ మేము చర్చలు జరుపుతున్నాం.. కానీ తలపై తుపాకి ఎక్కుపెట్టి లేదా గడువులతో మేము హడావుడిగా ఒప్పందాలు చేసుకోం..’’ అని పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. అంతేకాదు, వాణిజ్య ఒప్పందం దీర్ఘకాలిక ల దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.


న్యాయమైన వాణిజ్య షరతుల గురించి ప్రశ్నించగా.. ‘భారత్ తన మిత్ర దేశాలను ఎప్పుడూ ఇతర కారణాల ఆధారంగా కాకుండా జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయించింది... ఎవరైనా ఐరోపా సమాఖ్యతో స్నేహం చేయకూడదని చెబితే నేను అంగీకరించను. అలాగే ఎవరైనా రేపు కెన్యాతో పని చేయకూడదని చెబితే, అది కూడా నచ్చదు’ అని సమాధానం ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa