ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్.. మరోసారి ప్రపంచ పటంలో సరికొత్త గుర్తింపును సాధించేందుకు రెడీ అయింది. భారతదేశంలోనే మొట్టమొదటి 132 మీటర్ల కేబుల్ గ్లాస్ బ్రిడ్జ్.. బజరంగ్ సేతు ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. సుమారు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన.. ఆధునిక ఇంజినీరింగ్ను, పవిత్ర ఆధ్యాత్మికతను మేళవించి ఒక అద్భుత కట్టడంగా నిలవనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం అయిన తర్వాత.. ఇది భారతదేశంలో కెల్లా తొలి కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్ కాగా.. ఆసియా ఖండంలోనే ఈ తరహాలో నిర్మించిన రెండో వంతెనగా చరిత్రలోకి ఎక్కనుంది.
కేదార్నాథ్ ఆలయ రూపంలో ట్విన్ టవర్స్
ఇక ఈ బజరంగ్ సేతు నిర్మాణంలో అత్యాధునిక ఇంజినీరింగ్, పవిత్ర నిర్మాణ శైలిని సమ్మిళితం చేశారు. ఈ అద్దాల వంతెన ప్రధాన ట్విన్ టవర్స్ను ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆలయమైన కేదార్నాథ్ ఆలయ గర్భగుడి నమూనాలో తీర్చిదిద్దారు. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక సారాంశాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జికి ఒక చివరన కేదార్నాథ్ స్వామి విగ్రహం.. మరొక చివరన బద్రీనాథ్ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఈ 132 మీటర్ల వంతెన పై నుంచి చూస్తే.. కింద ప్రవహించే గంగానది అద్భుతమైన దృశ్యాలను వీక్షించే అవకాశం పర్యాటకులు, భక్తులకు కలుగుతుంది. ఈ బజరంగ్ సేతును కేవలం పర్యాటక ఆకర్షణ కోసమే కాకుండా.. స్థానిక రవాణా అవసరాల కోసం కూడా నిర్మిస్తున్నారు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన నడక మార్గాలను 65-66 మిల్లీమీటర్ల మందపాటి పారదర్శక గాజు పలకలతో నిర్మించారు. నదికి దాదాపు 57-70 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్లాస్ ఫ్లోర్పై నడిస్తే.. నేరుగా నదిపైనే నడుస్తున్న అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.
ఇక ఈ అద్దాల వంతెన మధ్య భాగంలో టూవీలర్స్, తేలికపాటి 4 చక్రాల వాహనాలు ప్రయాణించడానికి వీలుగా రూపొందించారు. దీనివల్ల స్థానికంగా గంగా నదికి ఒకవైపు నుంచి మరోవైపు.. అనుసంధానం మెరుగుపడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ బజరంగ్ సేతు నిర్మాణాన్ని 2022లో ప్రారంభించారు. రూ.68 కోట్ల నుంచి రూ.70 కోట్ల వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్ట్ 2025 సంవత్సరం చివరి నాటికి పూర్తి కానుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివర్లో ప్రజలకు అందుబాటులోకి రానుండగా.. 2026 ప్రారంభంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
బజరంగ్ సేతు అందుబాటులోకి వస్తే.. రిషికేష్ను ఆధ్యాత్మికత, సాహస, ఆధునికతను ఏకం చేసే గమ్యస్థానంగా మారుస్తుందని స్థానికులు చెబుతున్నారు. పరమార్థ నికేతన్ ఆశ్రమం, బీటిల్స్ ఆశ్రమం వంటి పర్యాటక కేంద్రాలకు ఈ గ్లాస్ బ్రిడ్జి బాగా దగ్గర్లో ఉండటం వల్ల.. ఇది మన దేశ ప్రజలకు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ పర్యాటకులకు కూడా ఒక టూరిస్ట్ స్పాట్గా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇది యోగా రాజధానిగా రిషికేష్ గుర్తింపును మరింత పటిష్టం చేస్తుందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa