ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి ఇచ్చిన మాట కోసం..,,ఒక్కడికే 150కి పైగా డిగ్రీలు.. జీతమంతా చదువులకే

national |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 08:26 PM

'డిగ్రీ పాసైనంత ఈజీ కాదురా సోడా కొట్టడమంటే' అంటూ ఓ సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. కానీ డిగ్రీ పాస్ కావడం అంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. చాలా మంది డిగ్రీలు చదవలేక మధ్యలోనే వదిలేసి ఏవో బిజినెస్‌లు, చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇక మరికొందరు మాత్రం ఏళ్లకేళ్లు కష్టపడి.. ఎలాగోలా డిగ్రీ పట్టా అందుకుంటారు. చదువే ప్రాణం అని బతికేవారు.. డిగ్రీలు, పీజీలు చేస్తూ.. పట్టాలు పొందుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వింటే మాత్రం మీరు కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఓ వ్యక్తి 10 కాదు, 20 కాదు.. ఏకంగా 150కి పైగా డిగ్రీలు పూర్తి చేశారు. 44 ఏళ్లుగా అవిశ్రాంతంగా చదువుతూ మరిన్ని డిగ్రీలు సాధించే పనిలో పడ్డారు.


తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ప్రొఫెసర్ డా. వి.ఎన్.పార్థిబన్.. ఇప్పటివరకు 150కి పైగా డిగ్రీలు, డిప్లొమాలు సాధించి.. డిగ్రీల భాండాగారంగా నిలిచారు. తన తల్లికి ఇచ్చిన ఒక వాగ్దానం కారణంగా 1981 నుంచి ఇప్పటివరకు అవిశ్రాంతంగా చదువుతూనే ఉన్నారు. మొదటి డిగ్రీలో అతి కష్టం మీద పాస్ కావడంతో ఆయన తల్లి బాధపడింది. దీంతో చదువు పట్ల కసి పెంచుకున్న పార్థిబన్.. ఇలా డిగ్రీలు సాధించడం ప్రారంభించారు. దీంతో తాను కేవలం పాస్ కావడమే కాకుండా.. ఏదో ఒకరోజు టాపర్ అవుతానని.. తల్లిని గర్వపడేలా చేస్తానని ప్రమాణం చేశారు.


ఇప్పటికే ఆయన 12 ఎంఫిల్ డిగ్రీలు ఉండగా.. ప్రస్తుతం నాలుగో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇక ఇలా డిగ్రీలు సంపాదించే తరుణంలో తనకు వచ్చే జీతంలో 90 శాతం ఖర్చు చేస్తున్నారు. 200 డిగ్రీలు అందుకోవడమే తన టార్గెట్ అని పార్థిబన్ తెలిపారు. అందుకోసమే గత 4 దశాబ్దాలకు పైగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రొఫెసర్ పార్థిబన్ అకడమిక్ డిగ్రీలు చూస్తే.. అవన్నీ ఒక యూనివర్సిటీల్లో కోర్సు కేటలాగ్‌లా కనిపిస్తాయి.


ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లా వంటి అనేక సబ్జెక్టులలో పార్థిబన్ ఒకటి కంటే ఎక్కువ మాస్టర్స్ డిగ్రీలు సాధించి.. 150కి పైగా డిగ్రీలు, డిప్లొమాలు సంపాదించారు. ఆయనకు 12 ఎంఫిల్ డిగ్రీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో పీహెచ్‌డీ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు.


ఇక తన అంతులేని చదువుల దాహాన్ని తీర్చుకునేందుకు ప్రొఫెసర్ పార్థిబన్ తన జీతంలో అక్షరాలా 90 శాతం వరకు యూనివర్సిటీ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కోసం ఖర్చు చేస్తారు. తెల్లవారుజామున నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు విద్యాసంస్థల్లో పాఠాలను బోధిస్తారు. ఇక కాలేజీల్లో దొరికే ప్రతి ఖాళీ సమయాన్ని తన చదువు కోసం వినియోగిస్తారు.


 ఇతరులు విశ్రాంతి తీసుకుంటుంటే.. ఆయన పుస్తకాల్లో మునిగిపోతారు. పట్టుదల ఉంటే దేనికీ పరిమితులు ఉండవని ప్రొఫెసర్ పార్థిబన్ నిరూపిస్తున్నారు. ఇప్పటివరకు 150కి పైగా డిగ్రీలు ఉన్నా.. తన ప్రయాణం ఇంకా ముగియలేదని భావిస్తున్నారు. 200 డిగ్రీల మైలురాయిని దాటడమే తన ముందు ఉన్న లక్ష్యమని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa