దేశంలో ఔషధాల నాణ్యత, భద్రతపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ( సీడీఎస్సీఓ ) చేపట్టిన నెలవారీ సమీక్షలో తీవ్రమైన లోపాలు బయటికి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన నాణ్యతా సమీక్షలో.. దేశంలోని 112 ఔషధ నమూనాలు నాణ్యత ప్రమాణాలకు సరిపోవని తేలగా.. ఒక దగ్గు సిరప్ నమూనాను ఏకంగా నకిలీది అని గుర్తించడం కలకలం రేపుతోంది. ఇక ఈ జాబితాలో నిత్యం చిన్న చిన్న వాటికి మనం వేసుకునే సాధారణ మందులు కూడా ఉండటంతో.. జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోట్ ప్రకారం.. మొత్తం 112 నమూనాల్లో 52 నమూనాలను కేంద్ర ఔషధ ప్రయోగశాలలు.. మిగిలిన 60 నమూనాలను రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలలు గుర్తించాయని తెలుస్తోంది. ఈ జాబితాలో పారాసిటమాల్, పాంటోప్రజోల్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు వంటి అనేక రకాల మందులు ఉండటం గమనార్హం. మరోవైపు.. ఇటీవల మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో చిన్నారుల దగ్గు సిరప్ల కారణంగా చాలా మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన వేళ.. తాజాగా ఛత్తీస్గఢ్లోని రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాల 'బెస్ట్ కాఫ్' అనే దగ్గు సిరప్ నమూనాను నకిలీగా సీడీఎస్సీఓ గుర్తించింది.
ఈ-ఫార్మసీ ప్లాట్ఫామ్లలో ఈ బెస్ట్ కాఫ్ సిరప్ను 'బెస్టోకెమ్ ఫార్ములేషన్స్ ఇండియా లిమిటెడ్' అనే కంపెనీ తయారు చేసిన ఫెనిలెఫ్రిన్, క్లోర్ఫెనిరమైన్ మాలియేట్, డెక్స్ట్రోమెథార్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ల ఫార్ములేషన్గా పేర్కొన్నారు. అయితే.. లేబుల్పై ఉన్నదాని ప్రకారం.. ఈ సిరప్ అసలు తయారీదారు మాత్రం.. తాము ఆ బ్యాచ్ను తయారు చేయలేదని తేల్చి చెప్పడంతో అది నకిలీదని తేలింది.
ప్రస్తుతం ఈ నకిలీ మెడిసిన్పై దర్యాప్తు జరుగుతున్నప్పటికీ.. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ చట్టం 1940 ప్రకారం.. ఒక ఔషధం మరొక ఔషధం పేరుతో తయారు చేయబడి.. ప్రజలను మోసగించే విధంగా ఉంటే అది నకిలీగా పరిగణిస్తారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్ కారణంగా 24 మంది పిల్లలు మరణించగా.. దానికి పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ నకిలీ సిరప్ వెలుగు చూడటం సంచలనంగా మారింది.
ఇక ఈ కోల్డ్రిఫ్ సిరప్లో ఔషధ ప్రమాణాల ప్రకారం 0.1 శాతం మాత్రమే ఉండాల్సిన డైథైలీన్ గ్లైకాల్ అనే విషపూరిత ద్రావకం.. ఏకంగా 48.6 శాతం ఉన్నట్లు కనుగొన్నారు. ఇక ఈ నెలలోనే మరో రెండు దగ్గు సిరప్లైన రెస్పిఫ్రెష్ టీఆర్, రీలైఫ్లలో కూడా పరిమితికి మించి డైథైలీన్ గ్లైకాల్ ఉన్నట్లు గుర్తించారు. ఈ 3 బ్రాండ్ల విషయంలో సీడీఎస్సీఓ ఇచ్చిన అధికారిక సమాచారం మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది.
ఈ నకిలీ ఔషధాలను తయారు చేస్తున్న కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలుగా డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1940 స్థానంలో మరో కొత్త చట్టాన్ని తేవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు.. కేంద్ర నియంత్రణ సంస్థ కూడా అనేక చర్యలు చేపట్టింది. ఫార్ములేషన్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల తప్పనిసరి పరీక్ష.. అధిక ప్రమాదకర ద్రావకాల ఆన్లైన్ పర్యవేక్షణ, ఫార్మా క్లస్టర్లలో రిస్క్ ఆధారిత తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలను మొదలుపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa