దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ మాజీ డీపీజీ మొహమ్మద్ ముస్తఫా కుమారుడు అఖిల్ అఖ్తర్ అనుమానాస్పద మృతి కేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తోన్న అఖ్తర్ రాసి డైరీ కోసం సిట్ అధికారులు శోధిస్తున్నారు. అఖిల్ అఖ్తర్ మరణ వాంగ్మూలం రాసినట్టు భావిస్తున్న ఈ డైరీ ఈ కేసులో కీలకంగా మారింది. అక్టోబరు 3న అఖ్తర్ సోషల్ మీడియాలో డైరీ ఫోటోను షేర్ చేస్తూ.. ఒకవేళ నేను చనిపోతే ఈ డైరీ తన మరణ వాంగ్మూలాన్ని బయటపెడుతుందని, తనపై విషప్రయోగం జరిగిందా? అనే అనుమానం ఉందని పోస్ట్ పెట్టాడు.
‘‘నేను ఒకవేళ చనిపోతే ఈ డైరీ నా మరణ వాంగ్మూలం అవుతుంది.. నాపై అల్యూమినియం ఫాస్పైడ్ విషయ ప్రయోగం జరిగిందా అని తనిఖీ చేయాలి’’ అని ట్వీట్ చేశాడు. అకిల్ అఖ్తర్ మృతిపై పోలీసలు హత్య కేసు నమోదుచేసి.. తండ్రి ముస్తాఫా, తల్లి రజియా సుల్తానా (మాజీ మంత్రి), సోదరి, భార్యను నిందితులుగా చేర్చారు. అయితే, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన మాజీ డీజీపీ.. ఎఫ్ఐఆర్ నమోదుచేయడాన్ని స్వాగతించారు. తాను ఏమీ దాచిపెట్టడం లేదని, నిజం వెలుగులోకి తేవాలని కోరారు.
పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ అధికారులు.. గురువారం అఖ్తర్ మృతదేహం గుర్తించిన గదిలో సోదాలు నిర్వహించారు కానీ డైరీ ఆచూకీ లభ్యం కాలేదు. అలాగే, డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాల్లో అకిల్ మెడికల్ రికార్డులను పరిశీలించి, అక్కడ స్టాప్తో మాట్లాడారు.
ఓ సీనియర్ పోలీస్ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. డైరీ గురించి ముస్తఫాను అడిగితే తమ స్వస్థలం షహారన్పూర్లో కుమారుడి అంత్యక్రియలు నిర్వహించి పంచకులకు తిరిగొచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ సహా దానిని అందజేస్తానని చెప్పారని తెలిపారు. పంజాబ్ మాజీ డీజీపీ ముస్తఫా మాత్రం తాను ఎప్పుడూ పారదర్శకంగా ఉన్నానని, ఇకపై అలాగే ఉంటానని చెప్పారు. తన కుమారుడు సోషల్ మీడియాలో వీడియోలో చెప్పిన విషయాలనే డైరీలో కూడా రాశాడని అన్నారు.
‘‘అఖ్తర్ తనకు డ్రగ్ ఓవర్డోస్ వల్ల మరణం సంభవించవచ్చని కూడా రాశాడు. కానీ, తరువాతి పేజీల్లో తన పిల్లలను చాలా ప్రేమిస్తున్నానని రాసి ఉంచాడు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబరు 26న ముస్తఫా కుటుంబం పంచకులకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో ఉన్న నలుగుర్ని సిట్ విచారించనుందని పేర్కొన్నారు. విచారణకు రావాలని కోరితే అంత్యక్రియలు జరిపించాల్సి ఉన్నందున ప్రస్తుతం రాలేమని చెప్పారని అన్నారు.
అఖిల్ మృతిచెందిన వారం గడిచినా అంతా మిస్టరీగానే ఉంది. పోస్ట్మార్టమ్ నివేదికలో అతని కుడి చేతిపై ఇంజెక్షన్ ఇచ్చినట్టు గుర్తించినప్పటికీ, మరణ కారణంపై స్పష్టత రాలేదు. దీంతో అంతర్గత అవయవాల విశ్లేషణ ఫలితాలు స్పష్టమైన సమాధానాలు ఇస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa