ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, ఆయన నాయకత్వం అద్భుతమని ప్రశంసలు కురిపించిన ప్రముఖ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్... అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపైనా తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ను నడిపించేందుకు రాహుల్ గాంధీ సరైన వ్యక్తి కాదని ఆమె స్పష్టం చేశారు. ఆయన ఎక్కువ సమయం విదేశాల్లో గడుపుతూ, సొంత దేశం గురించే ప్రతికూలంగా మాట్లాడతారని ఆరోపించారు.ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మేరీ మిల్బెన్ మాట్లాడుతూ, "భారత్కు నాయకత్వం వహించేందుకు రాహుల్ గాంధీ తగిన వ్యక్తి అని నేను అనుకోవడం లేదు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైంది. ప్రధాని మోదీ వరుసగా ఎన్నికల్లో గెలిచారు. భారత ప్రజలు మూడుసార్లు తమ ఓటు ద్వారా మోదీనే ఉత్తమ నాయకుడని తీర్పు ఇచ్చారు" అని అన్నారు.రాహుల్ గాంధీ వైఖరిని ఆమె తప్పుబట్టారు. "ఆయన అమెరికా వచ్చినప్పుడల్లా భారత్ గురించీ, ప్రధాని మోదీ గురించీ తక్కువ చేసి మాట్లాడతారు. ఒక దేశాన్ని, దాని ప్రజలను నిరంతరం విమర్శిస్తూ, వారి నుంచి ఓట్లు ఎలా ఆశిస్తారు అలాంటి వ్యక్తి దేశాన్ని ఎలా నడిపిస్తారు" అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ మద్దతుదారులు తనను ట్రోల్ చేస్తున్నా, తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.ప్రధాని మోదీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన తనకు మంచి స్నేహితుడని తెలిపారు. "ఐక్యరాజ్యసమితిలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొనడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం. ఆ రోజు ఆయన ఎంతో ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా మెలగడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని వివరించారు. ఉగ్రదాడుల అనంతరం భారత్ను రక్షించుకోవడంలో ప్రధాని మోదీ చూపిన ధైర్యవంతమైన నాయకత్వాన్ని ఆమె కొనియాడారు.భారతదేశం అన్నా, భారత ప్రజలన్నా తనకు ఎంతో ఇష్టమని, ఈ దేశాన్ని తన రెండో ఇల్లుగా భావిస్తానని మేరీ మిల్బెన్ పేర్కొన్నారు. తన చిన్నతనంలో స్మితా పాటిల్ అనే భారతీయ మహిళ తమను చూసుకుందని, ఆమె ద్వారానే తనకు భారతీయ సంస్కృతి, సంగీతం, ఆహారంపై మక్కువ పెరిగిందని ఆమె వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa